DA Salary Hike : కేంద్రం గుడ్ న్యూస్.. DA 2శాతం పెంపు.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతం ఎంత పెరగనుందంటే?
DA Salary Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు DA 2శాతం పెంపునకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డీఏ 53శాతం నుంచి 55శాతానికి పెరుగుతుంది. ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు మరింత పెరగనున్నాయి.

Good news for central government employees
DA Salary Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూ్స్.. కేంద్ర మంత్రివర్గం శుక్రవారం (మార్చి 28) ప్రభుత్వ ఉద్యోగులకు డియర్నెస్ అలవెన్స్ (DA)లో 2శాతం పెంపును ఆమోదించింది. ఈ సవరణతో డీఏ 53శాతం నుంచి 55 శాతానికి పెరుగుతుంది. దాంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెరగనున్నాయి.
7వ వేతన సంఘం కింద ఈ డీఏ పెంపు అందిస్తోంది. ఇప్పటికే, 8వ వేతన సంఘాన్ని కూడా కేంద్రం ఏర్పాటు చేసింది. కొత్త వేతన సంఘం సిఫార్సులు జనవరి 2026 నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. గతంలో డీఏ పెంపు జూలై 2024లో జరిగింది. ఆ సమయంలో ఈ డీఏ 50శాతం నుంచి 53శాతానికి పెంచారు. డీఏ 2శాతం పెంపుతో మొత్తంగా 55 శాతానికి పెరిగింది.
ఈ డీఏ, డీఆర్ పెంపు జనవరి 1, 2025 నుంచి కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు అమలులోకి వస్తుంది. ఈ పెంపు ప్రకటన ఇప్పటికే కనీసం 15 నుంచి 20 రోజులు ఆలస్యం అయింది. ఏప్రిల్ నెల జీతంలో పెన్షన్ 3 నెలల (జనవరి నుంచి మార్చి 2025) బకాయిలతో పాటు పెరిగిన డీఏను పొందుతారు.
డీఏ పెంపుతో ఎవరికి ప్రయోజనం? :
పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అధిగమించేందుకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే భత్యమే డియర్నెస్ అలవెన్స్ (DA). పెరిగిన జీవన వ్యయాల కారణంగా జీతాలను ప్రతి 10 ఏళ్లకు ఒకసారి పే కమిషన్ కనీస వేతనాలను నిర్ణయిస్తుండగా, ద్రవ్యోల్బణాన్ని కొనసాగించడానికి DA కాలానుగుణంగా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.
డీఏ పెంపుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్సనర్లు, కుటుంబ పెన్షనర్లకు ప్రయోజనం కలుగనుంది. హోలీకి ముందు కేంద్ర ప్రభుత్వం డియర్నెస్ అలవెన్స్ (DA), డియర్నెస్ రిలీఫ్ (DR) పెంపును ప్రకటించే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. మీడియా నివేదికల ప్రకారం.. డీఏ 2శాతం పెంపుదల ఉంటుందని అంచనా వేశాయి.
కేంద్రం DA ఎలా నిర్ణయిస్తుంది? :
ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రియల్ వర్కర్స్ (AICPI-IW) డేటా ఆధారంగా DA రేట్లు నిర్ణయిస్తారు. ఏదైనా సవరణపై నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం గత 6 నెలల గణాంకాలను అంచనా వేస్తుంది. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగే కేబినెట్ సమావేశం తర్వాత డీఏ పెంపుపై తుది నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు, పెన్షనర్లు త్వరలో పెరిగిన వేతనాలను అందుకోవచ్చు.
ఏడాదికి రెండుసార్లు డీఏ పెంపు :
ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం.. కేంద్ర ఉద్యోగుల భత్యాలను సంవత్సరానికి రెండుసార్లు పెంచుతారు. ఈ పెరుగుదల అర్ధ వార్షిక ప్రాతిపదికన జరుగుతుంది. చివరి పెరుగుదల జూలై 2024 లో జరిగింది. అప్పుడు డీఏను 50శాతం నుంచి 53శాతానికి పెంచారు. అంటే 3శాతం పెరిగింది. ఇప్పుడు కొత్త నిర్ణయం ప్రకారం.. డీఏ పెంపు 2శాతమే పెరిగింది. ఈ డీఏ పెంపు జనవరి 2025 నుంచి జూన్ 2025 వరకు ఉంటుంది.
మరో 2 నెలల్లో బకాయిలు :
మార్చి నెలలో డీఏ పెంపును ప్రభుత్వం ప్రకటించింది. అయితే, కేంద్ర ఉద్యోగులకు జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన డీఏ కూడా బకాయిలుగా లభిస్తుంది. కొత్త పెంపు తర్వాత కేంద్ర ఉద్యోగుల జీతం ఎంత పెరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
జీతం ఎంత పెరుగుతుంది? :
ఒకరి కనీస వేతనం రూ. 50వేలు అయితే 53శాతం DA ప్రకారం.. వారికి రూ. 26,500 డీఏ లభిస్తుంది. కానీ, 55శాతం డీఏ ప్రకారం.. రూ. 27,500 డీఏ లభిస్తుంది. ఉద్యోగుల జీతం రూ.1,000 పెరుగుతుంది.
ప్రస్తుతం, రూ.70వేల కనీస వేతనంపై, డియర్నెస్ అలవెన్స్ రూ.37,100గా ఉంటుంది. కానీ, 55 శాతం డీఏ ప్రకారం.. డియర్నెస్ అలవెన్స్ రూ.38,500గా ఉంటుంది. ఉద్యోగుల జీతం రూ. 1,400 పెరుగుతుంది.
అదేవిధంగా, ఒక లక్ష కనీస వేతనం పొందే వారికి 53 శాతం డీఏ చొప్పున రూ. 53వేలు డియర్నెస్ అలవెన్స్ లభించేది. కానీ, ఇప్పుడు వారికి 55 శాతం చొప్పున రూ.55వేలు డీఏ లభిస్తుంది. అంటే ఉద్యోగుల జీతం నెలకు రూ.2వేలు పెరుగుతుంది.
అదేవిధంగా, ఒక పెన్షనర్ ప్రాథమిక పెన్షన్ రూ. 9వేలు అయితే, నెలకు రూ. 180 అదనంగా లభిస్తుంది. ఒక ఏడాదిలో రూ. 2,160 పెరుగుతుంది.
ఏదైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కనీస వేతనం రూ. 19వేలు అయితే.. రూ. 10,070 డియర్నెస్ అలవెన్స్ లభిస్తుంది. ఇప్పుడు 2 శాతం పెంపుతో ఈ వేతనం రూ.10,450కు పెరుగుతుంది. కేంద్ర ఉద్యోగుల డీఏ నెలకు రూ.380 పెరిగింది. దాంతో పాటు, కేంద్ర ఉద్యోగులకు రెండు నెలలకు అంటే.. జనవరి, ఫిబ్రవరి నెలలకు రూ.760 బకాయిలు లభిస్తాయి.
78 నెలల్లో ఇదే ఫస్ట్ టైమ్ :
గత కొన్ని ఏళ్లలో డియర్నెస్ అలవెన్స్ 3 శాతం నుంచి 4 శాతం మాత్రమే పెరిగింది. కానీ, 78 నెలల్లో 6.6 సంవత్సరాలలో మొదటిసారిగా డీఏ కేవలం 2 శాతం మాత్రమే పెరిగింది. 2018 సంవత్సరం ప్రారంభంలో డియర్నెస్ అలవెన్స్ 2 శాతంగా పెరిగింది. అప్పటి నుంచి 3 శాతం లేదా 4 శాతం మాత్రమే పెరిగింది.