ముకేశ్ అంబానీ ఆదాయం గంటకు ఎంతో తెలుసా!

జెఫ్ బెజోస్…బెర్నార్డ్ ఆర్నాల్ట్..బిల్ గేట్స్..వారెన్ బఫెట్..ఏంటీ లిస్ట్ అనుకుంటున్నారా…వీరందరి సంపాదన గంటకి కొన్ని కోట్ల రూపాయల పైమాటే…ఈ లిస్ట్లో మన ఇండియన్ రిచ్చెస్ట్ పర్సన్ ముకేష్ అంబానీ కూడా చేరారు. ముకేశ్ సంపాదన ఎంతో తెలుసా..గంటకి ఏడు కోట్ల రూపాయలు. ఏంటీ నమ్మలేకపోతున్నారా.
బిలియనీర్స్లో ఆసియాలోనే ముఖేష్ అంబానీ తోపు. కొన్ని సంవత్సరాలుగా అగ్రస్థానంలోనే ఉంటున్నారు. నేటికీ ఆ స్థానాన్ని ముఖేశ్ కాపాడుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు హరున్ గ్లోబల్ రిచ్ సంస్థ ప్రకటించిన కుబేరుల జాబితాలోనూ ఆయనే నంబర్ వన్ స్థానంలో నిలిచారు. భారత్లోనే కాదు… ఏషియాలోనే ఆయనను మించిన బిలియనీర్ మరొకరు లేరు.
ముఖేశ్ ఆస్తి ఇప్పుడు ఎంతనుకుంటున్నారు ? మీ ఊహలకు అందనంతగా ఆయన సంపాదించేశారు. ఇప్పుడాయన ఆస్తుల విలువ అక్షరాలా 67 బిలియన్ డాలర్లు. అంటే దాదాపు నాలుగు లక్షల కోట్లకు పైమాటే. రెండు తెలుగు రాష్ట్రాల ఏడాది బడ్జెట్తో సమానంగా ముఖేష్ సంపద ఉంటుంది. మరి ముఖేష్ ఆదాయం రోజుకు, గంటకు ఎంతో తెలుసా ? అది తెలిస్తే మీరు ఆశ్చర్యపోవడం ఖాయం. ప్రతి రోజు ఆయన 168 కోట్లు ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. అంటే గంటకు ముఖేష్ ఆదాయం ఏడు కోట్లన్న మాట. దీన్ని ఇక నిమిషాల్లోకి మార్చుకోండి. ఎంతుంటుందో మీరే తేల్చుకోండి.
67 బిలియన్ డాలర్ల సంపాదనతో ముఖేష్ ప్రపంచం కుబేరుల్లో 9వ స్థానంలో నిలిచారు. హరున్ గ్లోబల్ రిచ్ సంస్థ ప్రకటించిన తాజా కుబేరుల జాబితాలో ఆయన 9వ స్థానంలో నిలిచారు. అమెజాన్ అధినేత జెఫ్ బెజోన్ 140 బిలియన్ డాలర్ల ఆదాయంతో అగ్రస్థానంలో నిలిచారు. ఇక రెండో స్థానంలో 107 బిలియన్ డాలర్ల ఆదాయంతో LMHV కంపెనీ అధినేత బెర్నార్డ్ ఆర్నాల్ట్ నిలిచారు. మూడో స్థానాన్ని ప్రపంచమంతా తెలిసిన బిల్గేట్స్ 106 బిలియన్ డాలర్ల దక్కించుకున్నారు. ఇక ఇన్వెస్ట్మెంట్ గురుగా ప్రపంచమంతా తెలిసిన వారెన్ బఫెట్ 102 బిలియన్ డాలర్ల ఆదాయంతో ఫోర్త్ ప్లేస్లో నిలిచారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్ ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్ బర్గ్ ఐదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆయన ఆదాయం 84 బిలియన్ డాలర్లు.
హరున్ గ్లోబల్ రిచ్ రూపొందించిన జాబితా ఎక్కువ మంది బిలియనీర్లు చైనాలో ఉన్నట్టు తెలిపింది. 799 మంది కుబేరులతో చైనా అగ్రస్థానంలో నిలవగా.. 626 మందితో రెండో ప్లేస్లో అమెరికా నిలిచింది. ఆ తర్వాత 138 మంది బిలియనీర్లతో భారత్ మూడో స్థానంలో నిలిచింది. విదేశాల్లో ఉన్న భారతీయులనూ కలిపితే ఈ సంఖ్య 170కి పెరుగుతోంది. గతేడాది కొత్తగా భారత్లో 34 మంది బిలియనీర్లు పుట్టుకొచ్చినట్లు హరుణ్ గ్లోబల్ రిచ్ నివేదిక తెలిపింది. ప్రతి నెలా ముగ్గురు చొప్పున కుబేరులు భారత్లో పుట్టుకొస్తున్నట్టు ఆ జాబితా తెలియజేస్తోంది.
Read More>>అంకిత్ శర్మ హత్య : ఆప్ కౌన్సిలర్ తాహీర్పై ఆరోపణలు