RBI Cloud Services : ప్రపంచ సంస్థల ఆధిపత్యానికి చెక్.. 2025లో ఆర్బీఐ స్వదేశీ క్లౌడ్ సర్వీసులు.. తక్కువ ధరకే లోకల్ డేటా స్టోరేజీలు..!
RBI Cloud Services : ప్రపంచ క్లౌడ్ సర్వీసు మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న అమెజాన్ వెబ్ సర్వీసులు, మైక్రోసాఫ్ట్ అసూర్, గూగుల్ క్లౌడ్, ఐబీఎమ్ క్లౌడ్లకు పోటీగా క్లౌడ్ ప్లాట్ఫారమ్ను స్థానిక ఐటీ సంస్థలకు ఆర్బీఐ అప్పగించనుంది.

RBI aims to launch cloud services in 2025
RBI Cloud Services : క్లౌడ్ సర్వీసుల విషయంలో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) సరికొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. వచ్చే ఏడాది 2025లో పైలట్ ప్రోగ్రామ్ను ప్రారంభించాలని ఆర్బీఐ యోచిస్తోంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు సరసమైన ధరలకు డేటా స్టోరేజీని అందించాలని భావిస్తోంది. స్థానిక ఐటీ సంస్థల సేవలను వినియోగించుకోవాలని ఆర్బీఐ యోచిస్తోంది. ఇప్పటికే క్లౌడ్ సర్వీసు మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తున్న అమెజాన్ వెబ్ సర్వీసులు, మైక్రోసాఫ్ట్ అసూర్, గూగుల్ క్లౌడ్, ఐబీఎమ్ క్లౌడ్లకు పోటీగా క్లౌడ్ ప్లాట్ఫారమ్ స్థానిక ఐటీ సంస్థలకు ఆర్బీఐ అప్పగించనుంది.
ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ నివేదిక ప్రకారం.. క్లౌడ్ సర్వీసు అనేది ఆసియాలోనే మూడో అతిపెద్ద మార్కెట్. 2023లో భారత్లో 8.3 బిలియన్ డాలర్లుగా ఉన్న క్లౌడ్ సర్వీసు మార్కెట్.. 2028 నాటికి 24.2 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. అయినప్పటికీ, ఈ క్లౌడ్ సర్వీసు మార్కెట్ ఎక్కువగా విదేశీ సంస్థలచే ఆధిపత్యంలోనే నడుస్తోంది.
రాబోయే కొద్ది నెలల్లో ఈ క్లౌడ్ సర్వీసును చిన్న స్థాయిలో స్వదేశంలోనే ప్రారంభించాలని సీనియర్ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. వచ్చే కొన్ని ఏళ్లలో పైలట్ దశలవారీగా విస్తరించనున్నట్టు సమాచారం. ప్రస్తుత చిన్న బ్యాంకింగ్, ఆర్థిక సేవల సంస్థల అవసరాలపై దృష్టి సారించి క్లౌడ్ సర్వీసును రూపొందిస్తోంది. ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత దాస్ గత ఏడాది డిసెంబర్లో ఆర్థిక సేవల పరిశ్రమకు పబ్లిక్ క్లౌడ్ను ఏర్పాటు చేసే ప్రతిపాదనను ప్రకటించారు.
ఈ ప్రాజెక్ట్కి సలహాదారుగా కన్సల్టెన్సీ సంస్థ (EY)ని నియమించారు. క్లౌడ్ ప్రారంభ ఫ్రేమ్వర్క్ను సెంట్రల్ బ్యాంక్ పరిశోధన విభాగం ఇండియన్ ఫైనాన్షియల్ టెక్నాలజీ అండ్ అలైడ్ సర్వీసెస్ అభివృద్ధి చేస్తోంది. నివేదికల ప్రకారం.. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ప్రైవేట్ రంగ సాంకేతిక సంస్థల భాగస్వామ్యంతో క్లౌడ్ సర్వీసు అభివృద్ధి చెందుతుంది.
ప్రాజెక్ట్ ప్రారంభంలో సెంట్రల్ బ్యాంక్ అసెట్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా నిధులు సమకూరుస్తుంది. ఆ తర్వాత రూ. 229.74 బిలియన్లు, సెంట్రల్ బ్యాంక్ చొరవలో ఈక్విటీ వాటాలను పొందడానికి ఆర్థిక సంస్థలను ఆహ్వానిస్తుంది. స్థానిక ఐటీ సంస్థల భాగస్వామ్యంతో క్లౌడ్ సర్వీసును ఏర్పాటు చేస్తోంది. పేమెంట్లు, ఆర్థిక డేటా స్థానికీకరణను ప్రోత్సహించే దిశగా ఆర్బీఐ ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.