SHARE Market : స్టాక్ మార్కెట్ లో బుల్ పరుగులు.. ఆల్ టైం హై లో సెన్సెక్, నిఫ్టీ
స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో దూసుకుపోతున్నాయి. వరుసగా రెండో వారంలోనూ ఇన్వెస్టర్లు లాభాలు పొందుతున్నారు.

Market
SHARE Market స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో దూసుకుపోతున్నాయి. వరుసగా రెండో వారంలోనూ ఇన్వెస్టర్లు లాభాలు పొందుతున్నారు. సెన్సెక్స్, నిఫ్టీలు ఒడిదుడులకు తట్టుకుంటూ కొత్త ఎత్తులను చేరుతున్నాయి. మంగళవారం కూడా మార్కెట్లలో రికార్డుల పరంపర కొనసాగింది.
మంగళవారం బీఎస్ఈ- సెన్సెక్స్ 210 పాయింట్లు పుంజుకుని.. 55,792 వద్దకి చేరింది. ఎన్ఎస్ఈ-నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో సరి కొత్త రికార్డు స్థాయి అయిన 16,614 వద్ద ముగిసింది. బీఎస్ఈ- సెన్సెక్స్ ఇవాళ ఒక దశలో రికార్డు స్థాయిలో పాయింట్లు లాభపడి 55,854 పాయింట్లను టచ్ చేసి రికార్డు సృష్టించింది.
బీఎస్ఈ సెన్సెక్స్ ఈ రోజు ఉదయం 55,565 పాయింట్లతో ప్రారంభమైంది. ఆ వెంటనే పాయింట్లు కోల్పోతూ 55,386 పాయింట్లను తాకింది. ఇక మార్కెట్లో కరెక్షన్ మొదలైందని అనుకునేలోగా ఒక్కసారిగా పుంజుకుంది. మార్కెట్ ముగిసే సమయానికి 209 పాయింట్లు లాభపడి 55,792 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. టెక్ మహీంద్రా, నెస్లే, హెచ్యూఎల్, టైటాన్, టీసీఎస్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, ఎల్&టీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.
అయితే ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు- షాంఘై (చైనా), నిక్కీ (జపాన్), కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్సెంగ్ (హాంకాంగ్) నష్టాల్లో ఉన్నా.. దేశీయ సూచీలు మాత్రం వరుస లాభాలతో దూసుకుపోతుండటం విశేషం. అప్ఘాన్ సంక్షోభం నేపథ్యంలో మదుపరులు కాస్త ఆచితూచి వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఈ కారణంగా సూచీలు ఒడుదొడుకులకు లోనయ్యాయి. అయితే ఐటీ, ఎఫ్ఎంసీజీ షేర్లు సానుకూలంగా స్పందించడం వల్ల ఒడుదొడుకుల నుంచి తేరుకోగలిగాయి.