Tata Car Prices Hike : కొత్త కారు కొంటే ఇప్పుడే కొనండి.. ఫిబ్రవరి 1 నుంచి ఈవీలు సహా భారీగా పెరగనున్న టాటా కార్ల ధరలు
Tata Cars Prices : టియాగో, నెక్సాన్, హారియర్, సఫారి వంటి పాపులర్ టాటా మోడల్ ధరలు భారీగా పెరగనున్నాయి. ఇటీవలే లాంచ్ అయిన టాటా పంచ్ ఈవీ కారు ధర కూడా పెరగనుంది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి.
Tata Car Prices Hike : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? అయితే, త్వరపడండి.. ఫిబ్రవరి 1 నుంచి టాటా కార్ల ధరలు భారీగా పెరగనున్నాయి. టాటా కార్లతో పాటు ఇటీవలే లాంచ్ అయిన టాటా ఎలక్ట్రిక్ కార్ల ధరలు కూడా పెరగనున్నాయి. దీనికి సంబంధించి దేశీయ ఆటోమేకర్ టాటా మోటార్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాలు ( EV) సహా మొత్తం ప్యాసింజర్ వాహనాలపై సగటున 0.7 శాతం ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. వచ్చే నెల నుంచి కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. టాటా మోటార్స్ కంపెనీ.. ప్రస్తుతం పెరుగుతున్న ఇన్పుట్ ఖర్చులను పాక్షికంగా ఆఫ్సెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.
0.7 శాతం పెరగనున్న టాటా కార్ల ధరలు.. :
ప్రతి మోడల్కు సంబంధించి కచ్చితమైన ధర పెరుగుదలను వెల్లడించనప్పటికీ, టాటా మోటార్స్ నిర్దిష్ట వేరియంట్, మోడల్పై ఆధారపడి 0.7 శాతం సగటు పెంపు ఉండనున్నట్టు కంపెనీ చెబుతోంది. అంటే.. టియాగో, నెక్సాన్, హారియర్, సఫారి వంటి పాపులర్ టాటా మోడల్ ధరలు భారీగా పెరగనున్నాయి. ఇటీవలే లాంచ్ అయిన పంచ్ ఈవీ మోడల్ ప్రారంభ ధర రూ. 11 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండగా.. దీని ధర కూడా పెరిగే అవకాశం ఉంది.
టాటా మోటార్స్ ఈ ఆర్థిక ఏడాదికి సంబంధించిన క్యూ3 ఫలితాలను ప్రకటించింది. ఇందులో మొత్తం 9 శాతం పెరిగి 3,38,177 యూనిట్లుగా నమోదైంది. కమెర్షియల్ వెహికల్స్ కూడా 98,679 యూనిట్లు విక్రయించినట్లు కంపెనీ వెల్లడించింది. టాటా కార్లు సహా ఇతర ప్యాసింజర్ వాహనాల విక్రయాలు ప్రపంచ మార్కెట్లో 1,38,455 యూనిట్లు విక్రయించినట్టు తెలిపింది.
2023 విక్రయాల్లో 9శాతం వృద్ధి నమోదు :
ప్రస్తుతం, నెక్సాన్ ఈవీ వంటి సెగ్మెంట్ ప్రముఖ మోడళ్లతో పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో ఆధిపత్య స్థానాన్ని కొనసాగిస్తోంది. కంపెనీ భారత మార్కెట్లో అనేక ఐసీఈ కార్లను విక్రయిస్తోంది. తయారీదారు ఇటీవల నెక్సాన్ రేంజ్, సఫారి, హారియర్ ఎస్యూవీలను అప్డేట్ చేసింది.
టాటా మోటార్స్ ఏప్రిల్ 2023లో చేసిన ముందస్తు చర్యను అనుసరించి ధరలను పెంచే ఈ నిర్ణయం మే 1 నుంచి అమల్లోకి వచ్చే ప్యాసింజర్ వెహికల్ (PV) రేంజ్ ధరలను దాదాపు 0.6శాతం పెంచింది. దేశీయ విపణిలో ఎలక్ట్రిక్ వాహనాలతో సహా మొత్తం ప్యాసింజర్ వాహనాల (PV) విక్రయాలలో కంపెనీ 9శాతం వృద్ధిని నమోదు చేసింది. డిసెంబర్ 2022లో అమ్మకాలు 40,043 యూనిట్లతో పోలిస్తే.. 2023 డిసెంబర్లో 43,470 యూనిట్లకు చేరుకున్నాయి.