మిస్రీ పునర్నియామకం…సుప్రీంకోర్టుకు టాటా సన్స్

  • Published By: venkaiahnaidu ,Published On : January 2, 2020 / 10:41 AM IST
మిస్రీ పునర్నియామకం…సుప్రీంకోర్టుకు టాటా సన్స్

Updated On : January 2, 2020 / 10:41 AM IST

టాటా గ్రూప్ చైర్మన్ గా సైరస్ మిస్రీని తిరిగి కొనసాగించాలని నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్(NCLAT) గతేడాది డిసెంబర్ లో ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ ఇవాళ(జవనరి-2,2020) టాటా సన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నెల 9న టీసీఎస్ బోర్డు సమావేశం ఉన్న నేపథ్యంలోనే సదరు కంపెనీ సుప్రీంను ఆశ్రయించినట్టు కనిపిస్తోంది. బోర్డు సమావేశం వరకు ట్రిబ్యునల్ కోర్టు ఆదేశాలపై స్టే విధించాలని టాటా సన్స్ కోరింది. సుప్రీంకోర్టు ఈ నెల 6న తిరిగి ప్రారంభమైన తర్వాత తాము ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేయాలని ధర్మసనాన్ని రిక్వస్ట్ చేసినట్లు టాటా సన్స్ తరపు న్యాయవాది తెలిపారు.

రతన్ టాటా తర్వాత 2012లో కంపెనీ ఆరో చైర్మన్‌గా మిస్త్రీ నియమితులయ్యారు. అయితే ప్రపంచంలోనే అత్యంత చౌక కారు టాటా నానో సహా కీలక పెట్టుబడులపై నిర్ణయాల్లో రతన్ టాటా, మిస్త్రీల మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తినట్టు వార్తలు వచ్చాయి. సంపన్న షాపూర్జీ పల్లోంజీ కుటుంబ వారసుడైన మిస్త్రీని… 2016 అక్టోబర్‌లో టాటా సన్స్ చైర్మన్ పదవి నుంచి అనూహ్యంగా తొలగించారు. దీంతో కంపెనీల చట్టం కింద ఆయన న్యాయ పోరాటానికి దిగారు.

టాటా సన్స్ చైర్మన్‌గా మిస్త్రీని తిరిగి నియమించడంతో పాటు ప్రస్తుత టాటా గ్రూప్ అధినేత ఎన్. చంద్రశేఖరన్ నియామకాన్ని రద్దు చేస్తూ నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ (NCLAT) డిసెంబర్-18,2019న తీర్పు వెలువరించింది. చంద్రశేఖరన్ నియామకం ‘‘చట్టవిరుద్ధమని’’ ఎన్‌సీఎల్ఏటీ స్పష్టం చేయడంతో మళ్లీ కంపెనీ పగ్గాలు చేపట్టేందుకు మిస్త్రీకి మార్గం సుగమం అయ్యింది. అయితే టాటా కంపెనీ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు వీలుగా నాలుగు వారాల పాటు తన తీర్పు అమలుపై ఎన్‌సీఎల్ఏటీ స్టే విధించిన విషయం తెలిసిందే.