ప్రణయ్ హత్య కేసులో నిందితులకు బెయిల్ : అమృతలో ఆందోళన

జిల్లా మిర్యాలగూడలో 2018, సెప్టెంబర్ 14న జరిగిన పెరుమాళ్ళ ప్రణయ్ హత్య కేసులో పీడీ యాక్ట్ నమోదై వరంగల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురు ప్రధాన నిందితులకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రణయ్ అమృతను కులాంతర వివాహం చేసుకున్న నేపథ్యంలో మిర్యాలగూడ జ్యోతి హాస్పిటల్ వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఏ 1గా ఉన్న అమృత తండ్రి తిరునగరు మారుతీ రావు. ఏ 4గా ఉన్న అబ్దుల్ కరీం. ఏ5 గా ఉన్న అమృత బాబాయ్ తిరునగరు శ్రవణ్ కుమార్ లు పి.డి యాక్ట్ కింద వరంగల్ జైలులో ఏడు నెలలుగా శిక్ష అనుభవిస్తున్నారు. అప్పుడు వీరి బెయిల్ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చింది. ఏప్రిల్ 26వ తేదీ శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.
దీనిపై ప్రణయ్ భార్య అమృత, తండ్రి బాలస్వామిలు స్పందించారు. పట్టపగలు హత్యలు చేసే వారికి బెయిల్ ఇచ్చి వారికి ధైర్యాన్నిఇచ్చినట్లు అయిందని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వారి నుండి మా కుటుంబానికి హాని ఉందని తెలిసి కూడా బెయిల్ మంజూరు చేయటం దురదృష్టకరమన్నారు. డబ్బు ప్రలోభాలతో సాక్ష్యాలను తారుమారు చేసి కేసును నీరు కార్చడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేస్తారని పేర్కొన్నారు. బెయిల్ రద్దు కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని. నిందితులకు తగిన శిక్ష పడేంతవరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. తమ కుటుంబానికి మరింత అదనపు సెక్యూరిటీ కల్పించాలని పోలీసులను కోరారు.