Hyderabad: హైదరాబాద్లో దారుణం.. ఎమ్ఐఎమ్ కార్పొరేటర్ అల్లుడి హత్య
హైదరాబాద్, పాతబస్తీలో యువకుడి హత్య జరిగింది. లలిత్ బాగ్ కార్పొరేటర్ మొహమ్మద్ అలీ షరీఫ్ కార్యాలయంలో సోమవారం ముక్తుజా అనస్ అనే యువకుడిని దుండగులు పొడిచి చంపారు.
Hyderabad: హైదరాబాద్, పాతబస్తీలో దారుణం జరిగింది. ఎమ్ఐఎమ్ కార్పొరేటర్ అల్లుడిని దుండగులు హత్య చేశారు. లలిత్ బాగ్ కార్పొరేటర్ మొహమ్మద్ అలీ షరీఫ్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. మృతుడిని ముక్తుజా అనస్గా గుర్తించారు. కార్పొరేటర్ షరీఫ్ సోదరి కుమారుడే అనస్.
ముక్తుజా.. బంజారాహిల్స్లోని ఒక కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో ఆరుగురు దుండగులు అనస్పై కత్తులతో దాడి చేశారు. అనస్ కార్పొరేటర్ కార్యాలయంలో ఉన్నప్పుడే దండగులు దాడికి పాల్పడ్డట్లు స్థానికులు తెలిపారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డ అనస్ను స్థానికులు వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే, అక్కడ అనస్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.
ఘటన సమాచారం అందుకున్న పోలీసులు దాడి జరిగిన చోటుకు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా, స్నేహితుల మధ్య గొడవలే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.