నిజాంపేట ఘటన మరకముందే.. ఇళ్లలోకి చొరబడిన ముగ్గురు దుండగులు
నిజాంపేటలో దుండగుడు ఇంట్లోకి చొరబడిన షాకింగ్ ఘటన మరకముందే.. తాజాగా బాచుపల్లిలో కలకలం రేగింది.
Bachupally: హైదరాబాద్ నిజాంపేటలో దుండగుడు ఇంట్లోకి చొరబడిన షాకింగ్ ఘటన మరకముందే మరోసారి కలకలం రేగింది. ఈ సారి ముగ్గురు దొంగలు దర్జాగా ఇళ్లలోకి చొరబడి అందినకాడికి దోచుకుపోయారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని సీతారాం విల్లాలలో దొంగల బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి వేళ ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు హల్ చల్ చేశారు. ఇళ్లల్లోకి చొరబడి విలువైన వస్తువులు దోచుకెళ్లారు. ఏకంగా లాకర్ను ఎత్తుకుపోయారు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలకు చిక్కాయి.
కాలనీలోకి దొంగచాటుగా ఎంటరైన ముగ్గురు దుండగులు ఏమాత్రం భయం లేకుండా స్వైరవిహారం చేశారు. ఈ ముగ్గురూ తమను గుర్తు పట్టకుండా ఉండేందుకు తలకు టోపీలు, ముఖానికి మాస్క్ లు, చేతులకు గ్లోవ్స్ వేసుకున్నారు. వీరి చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రెండు విల్లాల్లో దుండగులు చోరీకి పాల్పడినట్టు పోలీసులు గుర్తిచారు. తాళాలు పగుల కొట్టి 2 తులాల వెండి, 8 వేల నగదు, లాకర్ ఎత్తుకుపోయారని సమాచారం. దొంగలను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
Also Read: ఘోర రోడ్డు ప్రమాదం.. నవ దంపతులతో సహా ఐదుగురు దుర్మరణం
భయాందోళనలో భాగ్యనగర వాసులు
దుండగులు ఇళ్లలోకి చొరబడుతున్న ఘటనలు వరుసగా వెలుగు చూడడంతో భాగ్యనగర వాసులు భయాందోళన చెందుతున్నారు. తమ ప్రాంతంలోనే రెండు రోజుల వ్యవధిలో రెండు ఘటనలు జరగడంతో నిజాంపేట, బాచుపల్లి ప్రాంత ప్రజలు భయపడుతున్నారు. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తోందని వణికిపోతున్నారు. పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేసి తమకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.
Also Read: ఒంటరి మహిళలు, వృద్ధులు జాగ్రత్త..! హైదరాబాద్లో షాకింగ్ ఘటన, ఇంట్లోకి దూరిన అపరిచితుడు