దారుణం: కన్నపిల్లలను కొట్టిచంపిన తల్లి

పెద్దపల్లి: గోదావరిఖని పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ కన్నతల్లి తన ఇద్దరు పిల్లలను తీవ్రంగా కొట్టి చంపింది. సప్తగిరి కాలనీ లో ఉండే రమాదేవి అనే ఇల్లాలు తన ఇద్దరు పిల్లలను చితకబాదింది. దీనితో తీవ్ర గాయాలపాలైన పెద్ద కొడుకు అజయ్ (11) అక్కడికక్కడే మృతి చెందగా, కొన ఊపిరితో ఉన్న రెండో కుమారుడు ఆర్యని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. డాక్టర్ల సలహా మేరకు మెరుగైన చికిత్స నిమిత్తం గోదావరి ఖని నుంచి కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆర్య(9) కూడా మరణించాడు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారుల హత్యకు కారకురాలైన తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.