భర్త ఫోన్లో మాట్లాడుతున్నాడని : పిల్లలకు విషం ఇచ్చిన తల్లి

హైదరాబాద్ : మియాపూర్లోని లక్ష్మీనగర్లో విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి తాను విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది ఓ తల్లి. ఈ ఘటనలో చిన్నారి హర్షిత మృతి చెందగా.. కుమారుడు హర్ష, తల్లి సుమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. భర్త సురేష్ ఫోన్లో మరో మహిళతో మాట్లాడటం తట్టుకోలేకపోయిన సుమ మనస్థాపానికి గురై విషయం తాగినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.
భర్త సురేష్పై భార్య సుమ అనుమానం పెంచుకుందని, భర్త మరో మహిళతో ఫోన్లో తరుచుగా మాట్లాడుతున్నాడని, ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో ఆమె ఇలా చేసిందని పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. అసలు ఏం జరిగింది అనే వివరాలు సేకరించే పనిలో పడ్డారు.