రేణిగుంట విమానాశ్రయంలో బుల్లెట్ల కలకలం

తిరుపతి : రేణిగుంట విమానాశ్రయంలో బుల్లెట్లు కలకలం రేపాయి. కడప జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడి వద్దనుంచి 20 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్ పోర్టులో తనిఖీల్లో భాగంగా కడప జిల్లా కమలాపురం టీడీపీ అభ్యర్ధి పుత్తా నర్సింహారెడ్డి ముఖ్య అనుచరుడు, సింగిల్ విండో చైర్మన్ కాశీభట్ల సత్యసాయినాధ్ శర్మ వద్ద 20 తూటాలు లభించాయి. విమానాశ్రయం అధికారులు తూటాలు స్వాధీనం చేసుకుని శర్మను అదుపులోకి తీసుకున్నారు.
ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ తన లైసెన్స్ డ్ గన్ ను సాయినాధ్ శర్మ పోలీసుల వద్ద డిపాజిట్ చేయకుండా తనవద్దనే ఉంచుకున్నట్లు తెలుస్తోంది. సాయినాధ్ శర్మ కడప జిల్లా కమలాపురం సింగల్ విడో అధ్యక్షుడు గా ఉన్నారు. పోలీసులు విచారణ జరుపుతున్నారు. సాయినాధ్ శర్మ వెపన్ డిపాజిట్ పై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మే 3వ తేదీతో వెపన్ లైసెన్స్ గడువు ముగియనుంది. అయినా ఎన్నికల కోడ్ అమల్లోకి రాగానే ఆయుధాన్ని స్ధానిక పోలీసు స్టేషన్ లో డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. కానీ శర్మ తనవద్దే ఉంచుకోవటంతో పోలీసులు విచారణ జరుపుతున్నారు.