నవంబర్ 1 నుంచి డిగ్రీ కాలేజీలు ప్రారంభం

నవంబర్ 1 నుంచి డిగ్రీ కాలేజీలు ప్రారంభం

ఈ సంవత్సరం కరోనా వైరస్ కారణంగా విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలో నిర్వహించాల్సిన అన్ని పోటీ పరీక్షలను నిర్వహిస్తుంది. అడ్మిషన్ల ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగానే ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్ధులకు డిగ్రీలో అడ్మిషన్లు పొందేందుకు Dhosth నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభించింది. నవంబర్‌ 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా డిగ్రీ, పీజీ తరగతులను ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (UGC) నిర్ణయించింది. ఇందులో భాగంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల ప్రవేశాలను వచ్చే నెల 31లోగా పూర్తి చేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టింది.

అందుకే ఈ నెల (సెప్టెంబర్ 21, 2020)న డిగ్రీ మొదటి దశ సీట్ల కేటాయింపును ప్రకటించింది. రెండు, మూడు దశల కౌన్సెలింగ్‌ను కూడా వచ్చే నెల 10లోగా నిర్వహించి 15వ తేదీలోగా విద్యార్థులంతా కాలేజీల్లో చేరేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇక UGC షెడ్యూల్‌ ప్రకారమే రాష్ట్రంలోనూ అకడమిక్‌ కేలండర్‌ను అమలు చేస్తామని ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.

అంతేకాదు ఈ నెల 9, 10, 11, 14 తేదీల్లో నిర్వహించిన ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ ఫలితాలు.. వచ్చే నెల 3వ తేదీలోగా విడుదల కానున్నాయి. వీలైతే ఈ నెల 30న ఫలితాలను విడుదల చేసేందుకు కమిటీ పరిశీలిస్తోంది. ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించే అగ్రికల్చర్‌ ఎంసెట్‌ పరీక్షల ఫలితాలను కూడా వచ్చేనెల మొదటి వారంలోనే ప్రకటించేలా ప్రవేశాల కమిటీ చాలా ప్రయత్నాలు చేస్తోంది.