ఐటీ కారిడార్ లో కోవిడ్ పర్యవేక్షణకు హైపవర్ కమిటీ

హైదరాబాద్ ఐటీ కారిడార్లో కోవిడ్-19 పట్ల గందరగోళం లేకుండా ఉండేందుకు సైబరాబాద్ పోలీసులు, సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్తో పాటు పలు ప్రభుత్వ శాఖలను కలుపుకొని హైపవర్ కో ఆర్డినేషన్ కమిటీని ఏర్పాటు చేశారు. సోషల్ మీడియాలోనూ వివిధ మార్గాల ద్వారా వైరల్ అవుతున్న పుకార్లతో ప్రజలు గందరగోళానికి గురికాకుండా వాటిని నిర్ధారించుకునేందుకు పాటించాల్సిన అంశాలు, ఒక వేళ అనుమానం ఉంటే ఆ సమయంలో వ్యవహరించాల్సిన తీరుపై ఓ నిర్ధారిత ప్రక్రియ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసిజర్)ను రూపొందించారు. దీనికి సంబంధించిన పోస్టర్ను పోలీసు కమిషనర్ సజ్జనార్ విడుదల చేశారు.
ఈ హైపవర్ కో ఆర్డినేషన్ కమిటీ సభ్యులుగా సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్, కోవిడ్-19 ఐటీ కారిడార్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు.ఇందులో వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్, జీహెచ్ఎంసీ పశ్చిమండలం జోనల్ కమిషనర్ రవికిరణ్, హెచ్వైఎస్ఈఏ అధ్యక్షుడు మురళి,ఎస్సీఎస్సీ ప్రధాన కార్యదర్శి కృష్ణ ఏదుల, నాస్కామ్ రీజినల్ డైరెక్టర్ శ్రీకాంత్ శ్రీనివాసన్, ఐటీఈఅండ్సీ సీఆర్ఓ అమరనాథ్ ,టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ వినోద్కుమార్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ప్రతిరోజు నెలకొంటున్న పరిస్థితులను పర్యవేక్షిస్తూ అవసరమైన సందర్భాల్లో కార్పొరేట్ కార్యాలయాలకు సూచనలు ఇస్తుంది.
కమిటీ రూపొందించిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి
> ఐటీ కంపెనీలు, ఐటీ పార్క్స్ కార్పొరేట్ కార్యాలయాల నిర్వహకులు, ఉన్నతాధికారులు ఎప్పుడైనా స్పష్టంగా నిర్ధారించుకోకుండా ఎలాంటి ప్రకటనలు చేయొద్దు. ఒకటికి పదిసార్లు పరిశీలించుకుని విషయాన్ని ధ్రువీకరించుకోవాలి.
> కోవిడ్-19 అనుమానం ఉంటే వెంటనే డయల్ 104కు సమాచారం అందించండి. అదే విధంగా సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ను సంప్రదించండి.
> ఒక వేళ కోవిడ్-19 అని వైద్య రిపోర్టులో తేలితే వెంటనే ఎస్సీఎస్సీ (9000257058)కి సమాచారం అందించాలి. జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించి ఆ ప్రాంతంలో డిస్ ఇన్ఫెక్షన్ ప్రక్రియను చేపట్టాలి. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నం.ఎపిడెమిక్ సెల్-డాక్టర్ లలిత 9849902438 లేదా డాక్టర్ జనార్దన్ 8008456677 లను సంప్రదించాలి.
> హై పవర్ కో ఆర్డినేషన్ కమిటీ ఐటీ కారిడార్లో నెలకొన్న తాజా పరిస్థితిని పర్యవేక్షించింది. ఎలాంటి గందరగోళం లేకుండా అందరూ ప్రశాంతంగా తమ వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చని తెలిపింది. కొన్ని కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫర్ హోమ్ సౌకర్యాన్ని కల్పిస్తుంది. అది వారి సొంత నిర్ణయమని కమిటీ తెలిపింది. అలా సౌకర్యం కల్పించే కంపెనీలు ఆ సమాచారాన్ని నోడల్ అధికారికి, ఎస్సీఎస్సీకి అందజేయాలని కమిటీ మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.
See Also | నేనే కేర్ తీసుకుంటా… ప్రతి నెల గ్రామ పంచాయతీలకు డబ్బులు పంపిస్తా : సీఎం కేసీఆర్