సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం, ఆ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు బంద్

కరోనావైరస్‌ కట్టడికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు

  • Published By: veegamteam ,Published On : March 23, 2020 / 12:50 PM IST
సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం, ఆ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు బంద్

Updated On : March 23, 2020 / 12:50 PM IST

కరోనావైరస్‌ కట్టడికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు

కరోనావైరస్‌ కట్టడికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు నిలిపివేసింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. మంగళవారం(మార్చి 24,2020) నుంచి గాంధీ, ఫీవర్ ఆస్పత్రి, ఉస్మానియా, చెస్ట్, కింగ్ కోఠి ఆస్పత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఇక రెగ్యులర్ చెకప్‌లు, అత్యవసరం కాని ఆపరేషన్లను ఇప్పటికే నిలిపివేసిన సంగతి తెలిసిందే. అవసరమైతే పారామెడికల్ సిబ్బందిని వినియోగించుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ ఆదేశాలను ప్రజలు తప్పకుండా పాటించాలని మంత్రి ఈటల కోరారు. రానున్న 10 రోజులు రాష్ట్రానికి చాలా కీలకమన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు 14రోజులు ఇళ్లల్లోనే ఉండాలని చెప్పారు. నిత్యవసర సేవలు, దుకాణాలు తెరిచే ఉంటాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. నిత్యవసర వస్తువుల కోసం ఇంట్లో నుంచి ఒక వ్యక్తి మాత్రమే బయటికి రావాలని మంత్రి సూచించారు. ప్రాణం కన్నా ఏదీ ముఖ్యం కాదన్నారు. దయచేసి ఎవరూ ఊళ్లకు వెళ్లొద్దన్నారు. మార్చి 31వరకు ఇళ్లలోనే ఉండాలన్నారు.

తెలంగాణలో 33కి చేరిన కరోనా కేసులు:
తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 33కి చేరింది. వీటిలో మూడు కాంటాక్ట్ కేసులు ఉన్నాయి. సోమవారం(మార్చి 23,2020) ఒక్క రోజే తెలంగాణలో 6 పాజిటివ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురి చేస్తోంది. అటు కరీంనగర్ లో కరోనా రెండో దశకు చేరుకుంది. కరోనా వైరస్ తో ఒక్కరు కూడా చనిపోలేదని మంత్రి ఈటల తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఒక్కరు కూడా వెంటిలేటర్ పై లేరన్నారు. కరోనా బాధితుల్లో ఒకరిని డిశ్చార్జ్ చేశామని, ఒకటి రెండు రోజుల్లో మరింత మందిని డిశ్చార్జ్ చేస్తామన్నారు. 

బతికుంటే బలుసాకు తినొచ్చు:
బతికుంటే బలుసాకు తినొచ్చన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్ లాక్ డౌన్ కు పిలుపునిచ్చారని మంత్రి ఈటల చెప్పారు. మార్చి 31 వరకు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, వైరస్ బారి నుంచి కాపాడుకోవాలన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, నిత్యవసర సరుకులు అందుబాటులో ఉంటాయని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు గుంపులుగా రాకుండా ఇంటికొకరు చొప్పున నిత్యసవరాల కోసం బయటకు రావాలని మంత్రి కోరారు. 

రోడ్డుపైకి వస్తే క్రిమినల్ కేసులు, వాహనాలు సీజ్:
కరోనా వైరస్ నియంత్రణకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు. కొందరు పని లేకపోయినా రోడ్లపైకి వస్తున్నారని మంత్రి మండిపడ్డారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనవసరంగా రోడ్లపైకి వస్తే కేసులు పెడతామన్నారు. వైద్య ఆరోగ్య శాఖకు సెలవులు లేవన్నారు. క్వారంటైన్ లో ఉన్న వాళ్లు ప్రజల్లోకి వెళ్లొద్దన్నారు. నిబంధనలు ఉల్లంఘించి ప్రజల్లోకి వెళితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో కరోనాతో ఒక్కరు కూడా చనిపోలేదన్న మంత్రి ఈటల కరోనా సోకిన వారందరూ కోలుకుంటున్నారని తెలిపారు. ఇటలీలో కరోనా పరిణామాల దృష్ట్యా సీఎం కేసీఆర్ మన యంత్రాంగాన్ని అలర్ట్ చేశారని చెప్పారు.

దయచేసి ఊళ్లకు వెళ్లొద్దు:
కరోనా కట్టడికి ప్రభుత్వం అసాధరణ నిర్ణయాలు తీసుకుంటోందని, దయచేసి ప్రజలంతా మార్చి 31 వరకు ఇళ్లలోనే ఉండాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. దయచేసి ఎవరూ ఊళ్లకు వెళ్లొదన్ని కోరారు. కూకట్ పల్లిలో నివాసం ఉండే వ్యక్తి నిత్యవసరాల కోసం గచ్చబౌలి వస్తే ఎలా అని సీపీ సజ్జనార్ ప్రశ్నించారు. ప్రజలు గుంపులుగా తిరగొద్దన్నారు. ప్రభుత్వ ఆదేశాలు పక్కాగా అమలు చేసేందుకు కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఇంటి పరిసరాల్లోని దుకాణాల్లోనే నిత్యవసరాలు తీసుకోవాలన్నారు.