‘మా’ ఫ్రెండ్లీ సమావేశంపై స్పందించిన జీవిత

  • Published By: veegamteam ,Published On : October 21, 2019 / 12:41 PM IST
‘మా’ ఫ్రెండ్లీ సమావేశంపై స్పందించిన జీవిత

Updated On : October 21, 2019 / 12:41 PM IST

మా ఫ్రెండ్లీ సమావేశంపై సినీ నటి జీవిత స్పందించారు. సమావేశానికి దాదాపు 200 మంది సభ్యులు హాజరయ్యారని తెలిపారు. ఇప్పుడు మా ఉన్న పరిస్థితుల్లో ఈ సమావేశం ఉపయోగకరం అన్నారు. నేను చెప్పే మాట వెనుక మా ఈసీ మెంబర్స్ ఉన్నట్లేనని తెలిపారు.

26 మంది ఈసీ మెంబర్స్ మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయని చెప్పారు. విభేదాలు, వాటికి కారణాలపై చర్చించుకుంటున్నామని వెల్లడించారు. అత్యవసర సమావేశాలకు 20 శాతం సభ్యులు అనుమతి ఉండాలన్నారు. మా లో ఇప్పుడు దాదాపు 1000 మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. 200 మంది సభ్యులు అంగీకరించాల్సి ఉంటుందన్నారు. 

ఇటీవల కాలంలో మూవీ ఆర్టిస్ట్‌ అసోషియేషన్‌ తరచూ వివాదాస్పదమవుతోంది. ఇటీవల జరిగిన ‘మా’ ఎలక్షన్స్‌ను శివాజీ రాజా ప్యానల్‌, నరేష్‌లు ప్యానల్‌లు ప్రతిష్టాత్మకంగా భావించటంతో ఆ ఎన్నికల జనరల్‌ ఎలక్షన్స్‌ను తలపించాయి. అయితే అనూహ్యంగా నరేష్‌ ప్యానల్‌ విజయం సాధించటంతో కొద్ది రోజుల పాటు కమిటీపై ఆరోపణలు ప్రత్యారోపణలు కొనసాగాయి. 

ఇప్పుడిప్పుడే పరిస్థితి కాస్త కుదుటపడుతుందనుకుంటున్న సమయంలో ‘మా’ అసోషియేషన్‌లో మరో వివాదం మొదలైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒకే ప్యానల్‌ నుంచి పోటి చేసిన నరేష్‌, జీవిత రాజశేఖర్‌ల మధ్య ఇప్పుడు గొడవ రాజుకుంది. అధ్యక్షుడు నరేష్‌ లేకుండానే ఎక్జిక్యూటివ్‌ ప్రెసిడెంట్‌ రాజశేఖర్‌, సెక్రటరీ జీవితలు జనరల్‌ బాడీ మీటింగ్‌ను నిర్వహించారు. అత్యవసర సమావేశం జరుగుతుంది అంటూ సభ్యులకు మెసేజ్‌ చేయటంలో అందరూ హాజరయ్యారు. అయితే ఈ మీటింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు నరేష్‌కు సమాచారం లేకపోవటంతో ఆయన తరపు న్యాయవాది స్పదించారు. అధ్యక్షుడికి తెలియకుండా మీటింగ్‌ ఎలా నిర్వహిస్తారంటూ జీవిత రాజశేఖర్‌లను ప్రశ్నించాడు.

అయితే ఈ విషయంపై స్పదించిన రాజశేఖర్‌, జీవితలు ఇది ఫ్రెండ్లీ మీటింగ్‌ మాత్రమే.. కోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటు చేసిన జనరల్‌ బాడీ మీటింగ్‌ కాదన్నారు. ఈ మీటింగ్‌లో తొమ్మిది నెలలో అధ్యక్షుడిగా నరేష్‌ తీసుకున్న నిర్ణయాలపై చర్చిస్తున్నారు.