ఓలి కోసం రంగంలోకి దిగిన చైనా

  • Published By: venkaiahnaidu ,Published On : July 7, 2020 / 08:07 PM IST
ఓలి కోసం రంగంలోకి దిగిన చైనా

Updated On : July 7, 2020 / 8:25 PM IST

నేపాల్‌ ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామాపై ఇంకా అస్పష్టత కొనసాగుతూనే ఉంది. భారత్ తో కయ్యానికి దిగుతున్న ప్రధాని ఓలి రాజీనామా చేయాలని సొంత పార్టీ నాయకులే డిమాండ్ చేస్తోన్న విషయం తెలిసిందే. భారత భూభాగాలను తమ భూభాగాలుగా చూపెడుతూ ఓ మ్యాప్ ను నేపాల్ పార్లమెంట్ ఆమోదించిన వెంటనే నేపాల్ లో రాజకీయ సంక్షోభం తీవ్రతరమైంది.

మరోవైపు ఓలి ప్రభుత్వాన్ని కాపాడటానికి చైనా రంగంలోకి దిగింది. ఓలి ప్రధాని పదవిని రక్షించే ప్రయత్నంలో భాగంగా చైనా రాయబారి హౌ యాంకి నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు జల నాథ్ ఖనాల్‌తో సమావేశం నిర్వహించారు. ఓలి రాజీనామాకు డిమాండ్ చేస్తున్న నేపాల్ లో అధికారంలో ఉన్న నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(NCP)నాయకులందరితో హౌ యాంకి చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

గ‌త వారం రోజుల వ్య‌వ‌ధిలో చైనా రాయ‌బారి హౌ యాంకి ప‌లువురు నేపాల్ నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. జూలై 3న‌ నేపాల్ అధ్య‌క్షురాలు విద్యాదేవి భండారిని క‌లిశారు. అయితే అది మ‌ర్యాద‌పూర్వ‌క భేటీ మాత్ర‌మే అని చెప్పారు. హౌ యాంకి, ప్రచండల మధ్య సమావేశం గురించి ఇంకా స్పష్టత రాలేదు. పీఎం ఓలికి వ్యతిరేకంగా కొనసాగుతున్న ప్రచారానికి నాయకత్వం వహిస్తున్న ప్రచండ, హౌ యాంకి ని కలవడానికి ఇష్టపడరని సమాచారం.

ఇదిలా ఉండగా చైనా రాయబార కార్యాలయం హౌ యాంకి సమావేశాలను సమర్థించింది. నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ఇబ్బందులు ఎదుర్కొవడం చైనాకు ఇష్టం లేదని తెలిపింది. నేపాల్‌ నాయకులు తమ విభేదాలను పరిష్కరించుకుని ఐక్యంగా ఉండాలని చైనా కోరుకుంటున్నట్లు ఆ దేశ ఎంబసీ ప్రతినిధి ఒకరు మీడియాతో చెప్పారు.

నేపాల్‌లో ప్ర‌ధాని కేపీ శ‌ర్మ ఓలి ప‌రిపాల‌న స‌రిగా లేదని, ఆయ‌న త‌క్ష‌ణ‌మే ప‌ద‌వి నుంచి వైదొల‌గాల‌ని ఎన్‌సీపీ ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్ ప్ర‌చండ నేతృత్వంలో అస‌మ్మ‌తి వెల్లువెత్తుతున్న‌ సంగతి తెలిసిందే. ఏప్రిల్ నెలాఖ‌రు నుంచి అంత‌ర్గ‌తంగా కొన‌సాగుతున్న ఈ వివాదం గురించి హౌ యాంకికి పూర్తిగా తెలుసు. ఈ నేపథ్యంలో నేపాల్‌లోని క‌మ్యూనిస్టు నాయ‌కుల‌నంతా ఏక‌తాటిపైకి తేవడంలో చైనా కీల‌కపాత్ర పోషించి ఉంటుంద‌ని.. అందుకే ఇప్పుడు అధికార పార్టీలో అస‌మ్మ‌తిని త‌గ్గించేంద‌కు ప్ర‌య‌త్నిస్తున్న‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

మరోవైపు ,ప్రధాని ఓలి తన ప్రధాన ప్రత్యర్థి, మాజీ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండతో వరుసగా సమావేశం అయినా లాభం లేకుండా పోయింది. అసంతృప్తి నేతలెవ్వరూ దారికి రావడం లేదు.