China : చైనాలో పుచ్చకాయలు, గోధుమలకు ఇళ్లు అమ్ముకుంటున్న బిల్డర్లు
పుచ్చకాయలు లేదా గోధుమలు, లేదంటే వెల్లుల్లి ఇవ్వండి కొత్త ఇల్లు కొనుక్కోండి అంటూ బోర్డులు పెట్టి మరీ ఇళ్లు అమ్ముతున్నారు చైనాలో బిల్డర్లు. దీనికి కారణం..
China: అది చైనాలోని ఓ నగరం. ఓ వ్యక్తి సొంత ఇల్లు కొనుక్కోవాలని ఎప్పునించో అనుకుంటున్నాడు. చాలా ఇళ్లు చూశాడు. కానీ నచ్చలేదు. అలా వెతగ్గా వెతగ్గా ఓ ఇల్లు బాగా నచ్చింది. ఆ బిల్డర్ దగ్గరకెళ్లాడు. ఇల్లు నచ్చింది కొంటాను అని చెప్పాడు. దానికి ఆ బిల్డర్ కూడా ఇంటి ధర చెప్పాడు. దానికి సదరు వ్యక్తి ఓకే రేపు వచ్చి అగ్రిమెంట్ చేసుకుంటానని వెళ్లిపోయాడు. అన్నట్లుగానే మరునాడు వచ్చాడు. వస్తూ వస్తూ కూడా ఓ ట్రక్కుడు పుచ్చకాయలు తెచ్చాడు. ఆ బిల్డర్ కూడా ఆ పుచ్చకాయలు చూసి మురిసిపోయాడు. ఆ పుచ్చకాయలు ఎన్ని ఉన్నాయో లెక్కపెట్టించాడు తన మనుషులతో..తరువాత తృప్తిగా ఓకే అంటూ పుచ్చకాలు తీసుకుని ఇంటి అగ్రిమెంట్ పేపర్లు సదరు వ్యక్తి చేతిలో పెట్టాడు. అదేంటీ ఇల్లు కొంటే డబ్బులు ఇవ్వాలిగానీ..పుచ్చకాయలు ఇవ్వటమేంటీ?.దానికి బిల్డర్ కూడా పుచ్చకాయలు తీసుకోవటమేంటి? అని ఆశ్చపోతున్నారా? అదే జరుగుతోంది చైనాలో.
పైగా ఇళ్లు కొనుక్కున్నవారు బిల్డర్లకు డబ్బులు ఇవ్వటంలేదు. డబ్బులకు బదులు పుచ్చకాయలు, గోధుమలు, వెల్లిల్లి వంటివి ఇస్తునన్నారు. అలా చైనీయులు ‘ఇచ్చి పుచ్చకుంటున్నారు’. దీనికి కారణం చైనాలో పెరిగిన ఆర్థిక సంక్షోభం. దీంతో బిల్డర్లు ఇళ్లు కొనేవారు లేక అల్లాడిపోతున్నారు. దీంతో ఇల్లు కొనుక్కోండి పుచ్చకాయలు..లేదా మీ వద్ద ఉన్నవి ఇవ్వండి అంటూ బోర్డులు పెడుతున్నారు. రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోవటంతో బిల్లర్డు ఈ మార్గం అనుసరిస్తున్నారు.
వరుస కోవిడ్ లాక్డౌన్లు, ఉక్రెయిన్-రష్యా యుద్దంతో ఎన్నో దేశాలతో పాటు ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదిగిన చైనాలో కూడా ఆర్థిక సంక్షోభం రోజు రోజుకు తీవ్రమవుతోంది. అక్కడి పారిశ్రామిక, రియల్ ఎస్టేట్ రంగాల్లో తీవ్ర సంక్షోభం నెలకొంది. సెంట్రల్ చైనాలోని హెనిన్ ప్రావిన్స్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలింది. నిర్మించిన ఇళ్లను అమ్మడానికి అక్కడి డెవలపర్స్ అష్టకష్టాలు పడుతున్నారు. గత్యంతరంలేక ఇళ్లను నగదుకు బదులు గోధమలు, వెల్లుల్లి,పుచ్చకాయల రూపంలో చెల్లింపులు చేయాలని ఆఫర్లు ఇస్తున్నారు. అయినా ఇళ్ల కొనుగోలుకు అక్కడి ప్రజలు ముందుకు రావడం లేదు.
Also read : China Population : చైనాలో వేగంగా తగ్గిపోతున్న జనాభా..ఫలితంగా..రోజు రోజు పడిపోతున్న ఉత్పాదక శక్తి
2020 నుంచి కోవిడ్ మహమ్మారి విజృంభించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా దెబ్బతిన్నది. ఆరు నెలల క్రితం నుంచి పలు దేశాల్లో వైరస్ ఉధృతి తగ్గుముఖం పడుతున్నా ఇప్పటికీ ఆర్థికంగా కోలుకోలేదు. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా ఇదే సమయంలో యుక్రెయిన్పై రష్యా దాడికి దిగడంతో ప్రపంచ దేశాలు కుదలేవుతున్నాయి. ఆహారం, చమురు, గ్యాస్ దిగుమతులు నిలిచిపోవడంతో పేద, ధనిక దేశాలు అన్న తేడా లేకుండా సంక్షోభం దిశగా పయనిస్తున్నాయి. నిత్యావసరాలు, ఇంధనం, గ్యాస్ ధరలు విపరీతంగా పెరుగుతుండడంతో ప్రజలు విలవిలలాడుతున్నారు.
చేతిలో చిల్లిగవ్వ లేక మీకున్నఇస్తే మాకున్నది ఇస్తాం అన్నట్లుగా ఇచ్చి పుచ్చుకోవటం చేస్తున్నారు. వివిధ దేశాల్లో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయింది. కట్టిన ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన ఇళ్లు అలా దిష్టిబొమ్మ మిగిలిపోవడంతో బిల్డర్లు ఆందోళన చెందుతున్నారు. ఇళ్ల అమ్మకాలపై చైనాలోని హెనాన్ ప్రావిన్సుకు చెందిన బిల్డర్లు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. ఇంటిని కొనుగోలు విషయంలో డౌన్పేమెంట్గా గోధమలు, వెల్లుల్లి చెల్లిస్తే చాలంటూ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇళ్ల కొనుగోలుకు గోధుమలు, వెల్లుల్లి చెల్లించడమేమిటని అవాక్కవుతున్నారా? మీరు చూస్తున్నది నిజంగా నిజమే. అయితే బిల్డర్లు ఈ ఆఫర్ ఇవ్వడం వెనుక మూడు కారణాలు ఉన్నాయి.
Also read : China Population : సంకటం పరిస్థితుల్లో చైనా..ఓవైపు ప్రపంచంపై ఆధిపత్యం కోసం ఆరాటం..మరోవైపు తగ్గిపోతున్న జనాభా
ఒకటి అంతర్జాతీయంగా గోధుమలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. రెండోవది చైనాలో నగదు కొరత పెరిగింది. మూడో కారణం హెనాన్ ప్రావిన్స్లో రైతులు అధికంగా ఉంటారు. వారిని ఆకట్టుకోవడమే ఈ ఆఫర్ ప్రధాన లక్ష్యం. ఈ ఆఫర్లో 24వేల డాలర్ల విలువైన గోధుమలు ఇస్తే ఇంటిని తమ పేరిట బుక్ చేసుకోవచ్చని బిల్డర్లు చెబుతున్నారు. మిగిలింది క్యాష్ రూపంలో ఇవ్వాలంటూ షరతు పెడుతున్నారు. ఒకవేళ గోధుమలు లేకపోతే వెల్లుల్లి తేవాలని కూడా సూచిస్తున్నారు. 16 రోజుల్లో 30 గోధుమల లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. బిల్డర్లు ఆశించినంతగా స్పందన లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
గతేడాది నుంచి చైనా వ్యాప్తంగా 70 శాతం ఇళ్ల విక్రయాలు పడిపోయాయి. 6 కోట్ల 50 లక్షలకు పైగా ఇళ్లు ఖాళీగా బోసిపోయి కనిపిస్తున్నాయి. అంటే దాదాపు ఫ్రాన్స్ మొత్తం జనాభాకు సరిపడా ఇళ్లు ఉన్నాయన్నమాట. వాటిని కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో అలాగే ఉండిపోతాయేమో అనే ఆందోళన బిల్డర్లలో వ్యక్తమవుతోంది. అందుకు కారణం చైనాలో ఏటా కోటి 50 లక్షలకు పైగా ఇళ్లను బిల్డర్లు నిర్మిస్తున్నారు. ఇన్ని ఇళ్లు కట్టడం అవసరమా? అంటే పెట్టుబడులకు రియల్ ఎస్టేట్ మంచిదని చైనీయుల నమ్మకం. దీంతో చాలా మంది రెండు, మూడు ఇళ్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి చైనా యువకుడు ఇల్లు కొన్న తరువాతే పెళ్లి చేసుకోవాలని ఆశిస్తాడు. చైనాలో మంచి ఇళ్లు ఉండడం స్టేటస్గా ఫీల్ అవుతారు. ఈ క్రమంలో ఇళ్లయితే ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని బిల్డర్లు భారీగా నిర్మిస్తున్నారు. కానీ వారి అంచనాలు ఇప్పుడు కుప్పకూలుతున్నాయి. గతేడాది నుంచి ఇళ్ల కొనుగోలుకు ఎవరూ ముందుకు రావడం లేదు. దీంతో వెల్లుల్లి, పుచ్చకాయలు, గోధుమలు వంటి వాటికి ఇళ్లను విక్రయిస్తున్నారు బిల్డర్లు.