Corona Animals : కరోనా వచ్చింది జంతువుల నుంచే.. అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం
చైనాలోని వుహాన్ లో తొలుత వెలుగుచూసిన కొవిడ్ కారక సార్స్-కొవ్-2 వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కోట్ల మందిని పొట్టన పెట్టుకుంది. ఇంకా వైరస్ ముప్పు వెంటాడుతూనే ఉంది. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.

Corona Animals
Corona Animals : చైనాలోని వుహాన్ లో తొలుత వెలుగుచూసిన కొవిడ్ కారక సార్స్-కొవ్-2 వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కోట్ల మందిని ఆసుపత్రి పాలు చేసింది. లక్షల మందిని పొట్టన పెట్టుకుంది. ఇంకా వైరస్ ముప్పు వెంటాడుతూనే ఉంది. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది. మానవాళికి ముప్పుగా మారిన ఈ మహమ్మారి ఎక్కడ, ఎలా పుట్టింది అనేదానిపై ఇంకా క్లారిటీ లేదు. ఈ వైరస్ మానవ సృష్టే అని, చైనాలోని వుహాన్ ల్యాబ్ లో తయారైందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. యావత్ ప్రపంచం చైనా వైపు వేలెత్తి చూపింది.
అయితే, కరోనా వైరస్ చైనాలోని వుహాన్ ప్రయోగశాలలో తయారైందని చెప్పేందుకు ప్రస్తుతానికి శాస్త్రీయ ఆధారాలేవీ లేవని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం ఒకటి తాజాగా స్పష్టం చేసింది. జంతువుల నుంచే అది మనుషుల్లోకి ప్రవేశించి ఉంటుందని అభిప్రాయపడింది. కరోనా పుట్టుక సంగతిని తేల్చేందుకు.. ఇప్పటివరకు లభించిన శాస్త్రీయ ఆధారాలన్నింటినీ ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం, బ్రిటన్లోని ఎడిన్బరో యూనివర్సిటీ, అమెరికాలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, చైనాలోని జియావోటాంగ్-లివర్పూల్ యూనివర్సిటీ సహా ప్రపంచవ్యాప్తంగా పలు విశ్వవిద్యాలయాలు, పరిశోధక సంస్థలకు చెందిన 21 మంది ప్రఖ్యాత శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు.
కరోనా వైరస్ ల్యాబ్ లో అనుకోకుండా ఆవిర్భవించి ఉండొచ్చన్న వాదనను పూర్తిగా తోసిపుచ్చలేమని వారు తెలిపారు. అయితే ల్యాబ్ నుంచే అది లీక్ అయ్యిందని చెప్పే ఆధారాలూ ప్రస్తుతానికి లేవన్నారు. మహమ్మారి తొలినాళ్లలో నమోదైన కేసులకు, వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ)కి మధ్య సంబంధాలేవీ కనిపించలేదని చెప్పారు. జంతువుల నుంచి మానవుల్లోకి వైరస్ ప్రవేశించిందన్న వాదనను బలపర్చేలా మాత్రం తగినన్ని శాస్త్రీయ ఆధారాలున్నాయని తెలిపారు.
ఏడాదికి పైగా నుంచి కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కారణంగా 40 లక్షల మందికిపైగా ప్రజలు మరణించారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) వెల్లడించింది. సంపన్న దేశాలు ఒక వైపు ఆంక్షలను సడలిస్తుండగా, మరోవైపు ఆసియా దేశాలు తాజా కేసులతో పోరాడుతున్నాయని తెలిపింది. ఆసియా వ్యాప్తంగా కొత్త లాక్డౌన్ ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది. కోవిడ్ మరణాల రేటు నెలలో పదిరెట్లు పెరిగి గ్లోబల్ హాట్స్పాట్గా ఇండోనేషియా నిలుస్తోందని, బుధవారం ఒక్కరోజే ఇండోనేషియాలో 1,040 మరణాలు సంభవించినట్లు డబ్ల్యూహెచ్వో చీఫ్ టెడ్రోస్ అధనమ్ వెల్లడించారు. వాస్తవానికి ఈ సంఖ్య ఎక్కువే ఉంటుందని ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారితో ప్రపంచం ప్రమాదకరస్థితిలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.