నాలుగు వందల కోట్ల మాస్క్లు ఎగుమతి చేసిన చైనా

ప్రపంచం ఊపిరి పీల్చుకోలేక ఇబ్బంది పడుతుంది. కరోనా మహమ్మారి దెబ్బకు చిగురుటాకులా వణికి పోతుంది. చైనాలో పుట్టి ప్రపంచాన్ని వణకిస్తున్న కరోనా వైరస్.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 12లక్షల మందికి సోకగా.. 70వేల మంది వరకు చనిపోయారు. అయితే ఈ వైరస్ పుట్టిన చైనాలో మాత్రం ప్రస్తుతం పరిస్థితులు అదుపులోకి వచ్చాయి.
ఈ క్రమంలోనే కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు దాదాపు 400 కోట్ల మాస్కులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది చైనా. మార్చి 1వ తేదీ నుంచి 3.86 బిలియన్ల మాస్కులు, 37.5 మిలియన్ల రక్షణ వస్త్రాలు, 16 వేల వెంటిలేటర్లు, 2.84 మిలియన్ల కోవిడ్–19 టెస్టింగ్ కిట్లు 50కి పైగా దేశాలకు ఎగుమతి చేసినట్లు చైనా అధికారాలు వెల్లడించారు. వీటి విలువ దాదాపు 1.4 బిలియన్ డాలర్లు ఉంటుందని చైనా అధికారులు తెలిపారు.
అయితే చైనా ఉత్పత్తి చేసిన మాస్కులను నెదర్లాండ్స్, పిలిప్పీన్స్, క్రొయేషియా, టర్కీ, స్పెయిన్ సహా పలు దేశాలు తిరస్కరించాయి. డచ్ ప్రభుత్వం 6 లక్షల మాస్క్లను తిప్పి పంపేసింది. అవి సర్జికల్ మాస్కులు కాదని తాము ముందే చెప్పినట్లు చైనా చెబుతుంది. కాగా, చైనాలో కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో కరోనా కట్టడికి అవసరమైన వైద్యపరికరాల ఉత్పత్తి చేసేందుకు స్థానిక పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నట్టు చైనా వెల్లడించింది.(పులికి కరోనా పాజిటివ్, ప్రపంచంలో ఫస్ట్ టైమ్, జంతువుకి సోకిన వైరస్)