మరింత భీకరంగా మారనున్న కరోనా మహమ్మారి, WHO వార్నింగ్

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ వో) కరోనా వైరస్ సంక్షోభంపై కొత్త హెచ్చరిక జారీ చేసింది. ప్రపంచదేశాలు పటిష్టమైన నిర్ణయాలు తీసుకోలేని పక్షంలో యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా సంక్షోభం మరింత తీవ్రం కానుందని, వైరస్ మరింత భీకరంగా మారనుందని ప్రపంచ దేశాలను డబ్ల్యూహెచ్వో హెచ్చరించింది. ఈ మేరకు సోమవారం(జూలై 13,2020) ప్రకటన చేసింది.
ప్రపంచ దేశాలు కనుక కఠినమైన హెల్త్ కేర్ కు సంబంధించి ముందు జాగ్రత్తలు కనుక తీసుకోకపోతే, కరోనా సంక్షోభం మరింత అధ్వాన్నంగా తయారు కానుందని డబ్ల్యూహెచ్వో చెప్పింది. ”కరోనా సంక్షోభం మరింత అధ్వాన్నంగా మారనుంది. చాలా దేశాలు రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్నాయి. ప్రజల ప్రథమ శత్రువుగా కరోనా వైరస్ ఎప్పటికీ ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ విషయంలో ముందు జాగ్రత్తలు చాలా అవసరం. ఒక వేళ ప్రాథమిక సూత్రాలను పాటించకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారనుంది” అని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనమ్ గేబ్రియాసిస్ తెలిపారు.
మేలుకోకపోతే మరింత అధ్వాన్నమైన పరిస్థితులు తప్పవు:
ప్రపంచ దేశాలు కరోనా కట్టడిలో అనుసరించాల్సిన చర్యలను అమలు చేయకపోవడం వల్లే కేసులు పెరుగుతున్నట్లు WHO డైరెక్టర్ జనరల్ చెప్పారు. దేశాధినేతల నుంచి వస్తున్న మిశ్రమ సందేశాల వల్ల మహమ్మారి నియంత్రణలో ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లినట్లు టెడ్రోస్ అభిప్రాయపడ్డారు. వైరస్ ఇంకా ప్రజలకు నెంబర్ వన్ శత్రువుగానే ఉందని, కానీ కొన్ని ప్రభుత్వాల, ప్రజల చర్యలు ఆ స్థాయిలో లేవని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భౌతిక దూరాన్ని పాటించడం, చేతులు కడుక్కోవడం, మాస్కులు ధరించడం లాంటి అంశాలను ప్రజలు, ప్రభుత్వాలు సీరియస్గా తీసుకోవాలని టెడ్రోస్ స్పష్టం చేశారు. ఇలా చేయకపోతే ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొనడం సాధ్యం కాదని ఆయన హెచ్చరించారు.
ప్రాథమిక సూత్రాలను పాటించకుంటే, అప్పుడు మహమ్మారి ఎక్కడికీ వెళ్లదని, అది మరింత అధ్వాన్నమైన పరిస్థితులకు దారి తీస్తుందన్నారు. ప్రభుత్వాలు చాలా స్పష్టమైన, బలమైన సందేశాన్ని జనాలకు ఇవ్వాలని, పౌరులు కచ్చితంగా నియమాలు పాటించాలన్నారు. వైరస్తో కలిసి జీవించే అవసరాన్ని నేర్చుకోవాలన్నారు.
అమెరికాలో కరోనా విలయతాండవం:
ఆదివారం(జూలై 12,2020) ప్రపంచవ్యాప్తంగా నమోదైన 2లక్షల 30వేల కేసుల్లో.. 80శాతం కేసులు 10 దేశాల నుంచి నమోదవగా, 50శాతం కేసులు రెండు దేశాల నుంచి నమోదైనట్టు డబ్ల్యూహెచ్ వో చీఫ్ తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా తీవ్రత అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా అగ్రస్థానంలో కొనసాగుతోంది. దాని తర్వాత బ్రెజిల్ ఉంది. త్వరలోనే మళ్లీ పాత రోజులు, పరిస్థితులు నెలకొంటాయని అనుకోవడం అవివేకం అవుతుంది, చాలా విషయాల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అని డబ్ల్యూహెచ్వో చీఫ్ అన్నారు.
అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేయడం.. కొన్ని ప్రాంతాలను పూర్తిగా తెరవడం వల్ల అక్కడ మళ్లీ కేసులు విజృంభించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎమర్జెన్సీస్ డైరక్టర్ డాక్టర్ మైఖ్ ర్యాన్ తెలిపారు. స్థానికంగా లాక్డౌన్ విధించడం వల్ల కొంత వరకు వైరస్ ఉధృతిని తగ్గించవచ్చన్నారు. కాగా, డబ్ల్యూహెచ్వో నుంచి వైదొలుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన అయితే చేశాడు కానీ, అధికారికంగా తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని టెడ్రోస్ చెప్పారు.
WHOపై ట్రంప్ నిప్పులు:
కరోనా వైరస్ చైనాలో పుట్టిందని, అక్కడి నుంచే ప్రపంచ దేశాలకు వ్యాపించిందని, ఈ విషయం తెలిసి కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ మౌనంగా ఉందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ కు సంబంధించిన సమాచారాన్ని చైనా దాచిపెట్టిందని ఆరోపించిన ట్రంప్, చైనాకు అనుకూలంగా మాట్లాడుతూ ప్రపంచ ఆరోగ్య సంస్థ బాధ్యత తీసుకోలేదని తీవ్రంగా విమర్శించిన ట్రంప్, చివరకు డబ్ల్యూహెచ్ వో నుంచి బయటకు వచ్చేశారు.
కాగా, కొన్ని రోజుల క్రితం తొలిసారిగా ట్రంప్ పబ్లిక్ ప్లేస్ లో ఫేస్ మాస్క్ తో కనిపించడం విశేషంగా మారింది. అమెరికాలోని ప్రతిపక్షాలు ట్రంప్ పై విరుచుకుపడ్డాయి. ట్రంప్ వైఖరి కారణంగానే అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభించిందని ఆరోపిస్తున్నాయి. కరోనా కట్టడిలో ట్రంప్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ట్రంప్ మాత్రం వారి ఆరోపణలను, విమర్శలను కొట్టిపారేస్తున్నారు.
చైనాలో కరోనా మూలాలు, నిగ్గు తేల్చనున్న డబ్ల్యూహెచ్వో టీమ్:
మరోవైపు డబ్ల్యూహెచ్ వో అడ్వాన్స్ టీమ్ ఒకటి చైనాకు వెళ్లింది. కరోనా వైరస్ చైనాలోనే పుట్టింది అని యావత్ ప్రపంచం అంటున్న వేళ, ఇందులో నిజానిజాలపై విచారణ చేసేందుకు ఆ బృందం రంగంలోకి దిగింది. చైనా సైంటిస్టులతో కలిసి పని మొదలు పెట్టడానికి ముందు టీమ్ సభ్యులు అందరూ క్వారంటైన్ లో ఉన్నారు. కరోనా వైరస్ మూలాన్ని తెలుసుకునే పనిలో నిమగ్నమైన డబ్ల్యూహెచ్వో ఈ మేరకు టీమ్ ని పంపింది. డబ్ల్యూహెచ్ఓ కు చెందిన ఇద్దరు నిపుణులు చైనాలో పర్యటిస్తున్నారు. ఈ విషయన్ని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ధృవీకరించింది.
కరోనాను ట్రేసింగ్ చేసేందుకు డబ్ల్యూహెచ్ఓతో చైనా ఏకాభిప్రాయానికి వచ్చాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చునింగ్ వెల్లడించారు. డబ్ల్యూహెచ్ఓ కు చెందిన ఇద్దరు నిపుణులు చైనా ప్రభుత్వ అనుమతితో చైనాకు వచ్చి వైరస్ ట్రేసింగ్ పనిపై చైనా నిపుణులతో చర్చలు ప్రారంభించారు. వీరు చైనాలోని వుహాన్ తోపాటు పలు ప్రాంతాల్లో పర్యటించి కరోనా వైరస్ మూలాలపై పరిశోధనలు చేస్తారు. ఇతర దేశాల్లో కూడా పర్యటించి పరిశోధనలు జరుపుతారని సమాచారం.
కరోనా వైరస్ వెనుక చైనా కుట్ర:
కరోనా వైరస్ మూలాన్ని గుర్తించడం చాలా ముఖ్యం అని డబ్ల్యూహెచ్వో డైరెక్టర్ జనరల్ అద్నమ్ ఇదివరకే చెప్పారు. కరోనా వైరస్ జంతువుల నుంచి మానవులకు వ్యాప్తి చెందిందని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. 2019 డిసెంబర్లో వైరస్ బయటపడిన చైనాలోని వుహాన్ మార్కెట్లో ఇది జరిగిందని తెలుస్తోంది.
ఇటీవల, హాంకాంగ్ను వదిలి అమెరికా చేరుకున్న వైరసిస్ట్ లి-మెంగ్ యాన్.. కరోనా వైరస్పై చైనా అబద్ధాలను బయటి ప్రపంచానికి వెల్లడించారు. ఈ వైరస్ గురించి చైనా ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో దాచిపెట్టిందని చెప్పారు. హాంకాంగ్ పరిశోధకులతో పాటు విదేశీ నిపుణులను సొంతంగా పరిశోధన చేయడానికి చైనా ప్రభుత్వం అనుమతించలేదని లి-మెంగ్ యాన్ తెలిపారు.
ఒక్కరోజే 2లక్షల 30వేల కరోనా కేసులు:
ఆదివారం(జూలై 12,2020) ఒక్కరోజే ప్రపంచ వ్యాప్తంగా 2లక్షల 30వేల 000 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అమెరికాలోనే అత్యధిక స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఆ దేశంలో అత్యధికంగా లక్షా 42వేల 992 కేసులు రికార్డ్ అయ్యాయి. అమెరికాలో ఇప్పటివరకు 32 లక్షల మంది కరోనా బారినపడగా లక్షా 34వేల 815 మంది మృతి చెందారు. అమెరికా తర్వాత స్థానంలో దక్షిణ ఆసియా ఉంది. ఇక వైరస్ మరణాల్లో ఇటలీ దేశాన్ని మెక్సికో దాటేసింది.
ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో కరోనా వైరస్ వల్ల 5వేల 285 మంది మరణించినట్లు డబ్ల్యూహెచ్వో తెలిపింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కోటి 30లక్షల కేసులు నమోదయ్యాయి. 5లక్షల 68వేల మంది మరణించారు. గత 24 గంటల్లో దక్షిణ ఆసియాలో 33వేల 173, యూరోప్లో 18వేల 804, ఆఫ్రికాలో 17వేల 884, మెడిటరేనియన్లో 15వేల 361, పసిఫిక్లో 2వేల 156 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి.