Elon musk: ట్విటర్ యూజర్లకు షాకిచ్చిన ఎలాన్ మస్క్.. రోజువారి పోస్టులపై పరిమితులు
ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ యూజర్లకు మరోసారి షాకింగ్ న్యూస్ చెప్పారు. ప్రతిరోజూ యూజర్లు చదవగలిగే ట్విటర్ పోస్టులపై పరిమితులు విధించారు. అయితే, ఇవి తాత్కాలికమేనని, త్వరలో వాటి పరిమితిని పెంచుతామని మస్క్ వెల్లడించారు.
![Elon musk: ట్విటర్ యూజర్లకు షాకిచ్చిన ఎలాన్ మస్క్.. రోజువారి పోస్టులపై పరిమితులు Elon musk: ట్విటర్ యూజర్లకు షాకిచ్చిన ఎలాన్ మస్క్.. రోజువారి పోస్టులపై పరిమితులు](https://10tv.in/wp-content/uploads/2023/07/Twitter.jpg)
Elon musk
Twitter owner Elon Musk: ట్విటర్ యాజమాని ఎలాన్ మస్క్ యూజర్లకు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. తాజాగా మరో షాకింగ్ విషయం చెప్పారు. యూజర్లు రోజువారి చదవగలిగే ట్వీట్లపై తాత్కాలిక పరిమితులు విధిస్తున్నట్లు మస్క్ చెప్పారు. అయితే, ఆ పరిమితులు ఒక్క అన్వెరిఫైడ్ అకౌంట్ల యూజర్లకే కాదు.. వెరిఫైడ్ అకౌంట్ల యూజర్లకు కూడా. వెరిఫై అకౌంట్ ఉన్న యూజర్లు రోజుకు 6వేల పోస్టులు చదవడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అన్వెరిఫైడ్ యూజర్లకు రోజుకు 600 పోస్టులకు, ఇక కొత్త అకౌంట్లు తెరిచిన అన్వెరిఫైడ్ యూజర్లు రోజుకు 300 ట్వీట్లు మాత్రమే చదవడానికి అవకాశం కల్పిస్తూ ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ షాకింగ్ ట్వీట్ చేశారు. విపరీతమైన డేటా స్క్రాపింగ్, సిస్టమ్ మానిప్యులేషన్ ను పరిష్కరించడానికి తాము ఈ పరిమితులను విధించినట్లు మస్క్ వివరించారు.
మస్క్ మరికొద్ది గంటల్లోనే మరో ట్వీట్ చేశాడు. ట్విటర్ యూజర్లు చదవ గలిగే పోస్టులపై పరిమితులు విధించిన మస్క్.. వాటిలో త్వరలో కొన్ని మార్పులు చేస్తామని చెప్పారు. వెరిఫై అకౌంట్ ఉన్నవారు 8వేలు, అన్ వెరిఫై అకౌంట్ కలిగిన యూజర్లు 800 పోస్టులు, కొత్త అన్వెరిఫైడ్ యూజర్లు 400 పోస్టులు చదివేలా త్వరలో పెంచుతామని మస్క్ ఆ ట్వీట్లో తెలిపారు. వందలాది సంస్థలు ట్విటర్ డేటాను అత్యంత దూకుడుగా స్క్రాప్ చేస్తున్నాయని, ఇది వినియోగదారును ప్రభావితం చేస్తుందని మస్క్ చెప్పారు.
Rate limits increasing soon to 8000 for verified, 800 for unverified & 400 for new unverified https://t.co/fuRcJLifTn
— Elon Musk (@elonmusk) July 1, 2023
శనివారం సాయంత్రం భారత్ సహా ప్రపంచ వ్యాప్తంగా పలు చోట్ల సోషల్ మీడియా దిగ్గజం ట్విటర్ సేవలకు అంతరాయం ఏర్పడింది. వెబ్, ఐవోఎస్, ఆండ్రాయిడ్ యూజర్లు ట్వీట్లను యాక్సెస్ చేయలేక పోయారు. కొంతమంది ట్వీట్ చేయగా రేట్ లిమిట్ ఎక్సీడెడ్ అని వచ్చింది. దీంతో మస్క్ కు సోషల్ మీడియా ద్వారా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. యూజర్ల ఫిర్యాదుల నేపథ్యంలో మస్క్ స్పందించారు. తాము సాధ్యమైనంత త్వరగా అప్డేట్ చేస్తామని చెప్పారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ గతంలో మస్క్ యాజమాన్యంలో ట్విటర్ను విడిచిపెట్టిన ప్రకటనదారులను తిరిగి పొందడానికి, ధృవీకరణ చెక్ మార్కులను ట్విటర్ బ్లూ ప్రోగ్రామ్లలో భాగంగా చేయడం ద్వారా సభ్యత్వ ఆదాయాన్ని పెంచడానికి అనేక చర్యలు తీసుకుంది.