Fire Accident : రెస్టారెంట్లో ఘోర అగ్నిప్రమాదం.. 44 మంది మృతి
ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్ లో అగ్నిప్రమాదం సభవించింది. వేగంగా మిగిలిన అంతస్తులకు మంటలు వ్యాపించడంతో మృతుల సంఖ్య భారీగా నమోదైంది.
Fire Accident Bangladesh : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఏడు అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో 44 మంది మృత్యువాత పడ్డారు. సుమారు 40మందికిపైగా గాయాలయ్యాయి. భారీగా మంటలు చెలరేగడంతో అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో సుమారు 70మందిని సురక్షితంగా భవనం నుంచి బయటకు తీసుకొచ్చారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read : Viral Video : ఆమ్లెట్ను ఇలా తిప్పాలని తెలియక.. ఇన్నాళ్లు గరిటెలు, స్పూన్లు వాడాము.. నీకో దండం!
అగ్నిమాపక శాఖ అధికారి మహ్మద్ షిహాబ్ మాట్లాడుతూ.. గురువారం రాత్రి 10గంటల సమయంలో ఢాకాలోని బెయిలీ రోడ్డులోని ఒక ప్రముఖ బిర్యానీ రెస్టారెంట్ లో ఈ మంటలు చెలరేగినట్లు చెప్పారు. ఈ మంటలు వేగంగా మిగిలిన అంతస్తులకు వ్యాపించడంతో భవనంలోనివారు మంటల్లో చిక్కుకున్నారని, ఫలితంగా మృతుల సంఖ్య భారీగా ఉందని తెలిపారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు రెండు గంటలు శ్రమించాల్సి వచ్చిందని తెలిపారు. భవనంలోని దాదాపు అన్ని అంతస్తుల్లో రెస్టారెంట్లతో పాటు వస్త్ర దుకాణాలు, మొబైల్ ఫోన్ దుకాణాలు ఉన్నాయి. రెస్టారెంట్ లో గ్యాస్ సిలిండర్ పేలడం వల్లనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు భావిస్తున్నారు.
ప్రభుత్వం ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అగ్నిప్రమాదంకు గల కారణాలపై విచారణ చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. బంగ్లాదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి సమంతా లాల్ సేన్ మాట్లాడుతూ.. ఈ ప్రమాదంలో 43 మంది మరణించగా.. 22 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. మంటలు వ్యాపించడాన్ని గమనించిన కొందరు భవనం పైనుంచి కిందకు దూకడంతో గాయాలపాలయ్యారు. మరికొందరు భవనం పైభాగానికి చేరుకొని సాయంకోసం ఆర్తనాథాలు చేశారు. వీరిని అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా కాపాడారు. ఈ ప్రమాదంలో సుమారు 40 మందికిపైగా గాయపడగా.. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.