మొజాంబిక్ పై ఇదాయ్ బీభత్సం : వెయ్యికి పైగా మృతులు
జొహాన్నెస్బర్గ్ : ఇదాయ్ తుపాను దక్షిణాఫ్రికా దేశాలను వణికించేసింది. ఈ ప్రభావం ముఖ్యంగా మొజాంబిక్పై భారీగా పడింది. ప్రజల జీవితాలను అతలాకుతలంచేసేసింది. గత 20 ఏళ్లలో ఇంతటి పెను విపత్తును ఎన్నడూ చూడలేదని.. మృతుల సంఖ్య వెయ్యికిపైగానే ఉండవచ్చని భావిస్తున్నట్లు దేశాధ్యక్షుడు ఫిలిప్ న్యూసీ ప్రకటించారు. నదులను వరద నీరు భారీగా వచ్చి చేరటంతో నదులన్నీ ప్రమాదస్ధాయిని మించి ప్రవహిస్తున్నాయి. దీంతో నదులు ఉప్పొంగి వరద నీరు గ్రామాలను ముంచెత్తింది. పలు ప్రాంతాల్లో నీటిలో మృత దేహాలు తేలియాడుతు భయానక వాతావరణం నెలకొంది. మార్చి 18వ తేదీ సోమవారం రేడియోలో ప్రసంగిస్తూ అధ్యక్షుడు ఫిలిప్ న్యూసి వెల్లడించారు. ఇప్పటివరకు 84 మృత దేహాలు లభ్యమైనట్లు అధికారికంగా ప్రకటించారు. ఇంకా గల్లంతైనవారికోసం గాలింపు చర్యల్ని ముమ్మరం చేశామని తెలిపారు.
ఆఫ్రికా ఖండంలోని మూడు దేశాలను ‘ఇడాయ్’ తుఫాను విరుచుకుపడింది. ఈ తుఫాను ధాటికి మొజాంబిక్, జింబాబ్వే, మలావీ దేశాలు అతలాకుతలం అయ్యాయి. మూడు దేశాల్లో సుమారు వందలాదిమంది మృత్యువాత పడ్డాగా..వందల మంది గల్లంతయ్యారు. 15 లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారు. ఇండ్లు, స్కూళ్లు, ఆస్పత్రులు , ప్రభుత్వ కార్యాలయాలు దెబ్బ తిన్నాయి. పలు చోట్ల ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కొండలు, పర్వత ప్రాంతాలకు చేరుకున్నారు. సహాయం కోసం ప్రజలు వేచి చూస్తున్నారు. ఐక్యరాజ్యసమితి..రెడ్క్రాస్ సంస్థలు మూడు దేశాల ప్రజలకు సహాయ చర్యల్ని కొనసాగిస్తున్నారు.
పొరుగున ఉన్న ఇతర ఆఫ్రికా దేశాల నుంచి ఆహార పదార్థాలు, తాగునీరు, మెడిసిన్స్ హెలికాప్టర్ల ద్వారా తరలిస్తున్నాయి. దాదాపు 10 లక్షలమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తు వారికి సహాయక చర్యల్ని కొనసాగిస్తున్నారు.