Rafale M Fighter : సముద్ర జలాల్లో ఆధిపత్యమే టార్గెట్.. హిందూ మహాసముద్రంలో డ్రాగన్కు చెక్
Rafale M Fighter : 2026 నాటికి రాఫెల్ మెరైన్ విమానాలు నేవీకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మన నావికాదళ ఆయుధాగారంలో రెండు విమాన వాహకనౌకలు ఉన్నాయి.
![Rafale M Fighter : సముద్ర జలాల్లో ఆధిపత్యమే టార్గెట్.. హిందూ మహాసముద్రంలో డ్రాగన్కు చెక్ Rafale M Fighter : సముద్ర జలాల్లో ఆధిపత్యమే టార్గెట్.. హిందూ మహాసముద్రంలో డ్రాగన్కు చెక్](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2024/05/Prepares-Rafale-M-Fighter-Jet-1.jpg)
Prepares Rafale M Fighter Jet
Rafale M Fighter : మనది ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద నావికాదళం… ఐతే శత్రుదేశాలతోపాటు సముద్రపు ఉగ్రవాదం… దొంగలు, పైరసీ ఇలా ఎన్నో సవాళ్లు ఉన్నాయి మనకు. అందుకే నేవీ ఆయుధ సంపత్తిని పెంచుకోవాలని నిర్ణయించింది కేంద్రం. ఇప్పటివరకు రష్యా తయారీ మిగ్ 29K విమానాలే నేవీ వద్ద ఉన్నాయి. వీటికి అదనంగా రాఫెల్ ఫైటర్ జెట్లు జతకలవడంతో సముద్ర జలాల్లో భారత్ ఆధిపత్యం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
రాఫెల్ మెరైన్ యుద్ధ విమానాల కొనుగోలుకు మన దేశానికి అత్యవసరం… ప్రపంచంలో నాలుగో అతిపెద్ద నావికాదళంగా మన నేవీకి గుర్తింపు ఉన్నా… హిందూ మహా సముద్రంపై ఆధిపత్యం కోసం మనతో చైనా పోటీ పడుతోంది. కొన్ని దశాబ్దాలుగా డ్రాగన్ తన నేవీని వేగంగా ఆధునీకరిస్తోంది.
Read Also : Virat Kohli : అవును ఇది నిజం.. ఆ రోజు ఎంతో భయపడ్డా : విరాట్ కోహ్లి
చైనా నౌకాదళంలో యుద్ధ విమాన వాహక నౌకలు, యుద్ధ నౌకలు, అణ్వాయుధాలను అమర్చిన సబ్మెరైన్స్ ఉన్నాయి. ఇదే సమయంలో మన నేవీకి రష్యాకు చెందిన మిగ్ 29కే విమానాలతోపాటు మరికొన్ని క్షిపణులు ఉన్నప్పటికీ, రాఫెల్ ఫైటర్ జెట్ల బలం అదనపు బలమనే చెప్పాలి. ప్రస్తుతం మన వద్ద ఉన్న మిగ్ 29కే విమానాల సంఖ్య 45 నుంచి 40కి తగ్గిపోయింది. ఇప్పుడు 26 రాఫెల్ యుద్ధ విమానాలతో మరింత బలం పెరిగినట్లైంది.
2026 నాటికి రాఫెల్ మెరైన్ విమానాలు అందుబాటులోకి :
2026 నాటికి రాఫెల్ మెరైన్ విమానాలు నేవీకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మన నావికాదళ ఆయుధాగారంలో రెండు విమాన వాహకనౌకలు ఉన్నాయి. పశ్చిమ, తూర్పు తీరంలో ఒక్కొక్క వాహకనౌకను మోహరించి శత్రు దేశాలను అదుపు చేయాలని చూస్తోంది నేవీ.
ముఖ్యంగా హిందూ మహా సముద్రంలో సైనిక స్థావరాలను ఏర్పాటుచేస్తున్న చైనాకు చెక్ చెప్పాలనేది మన రక్షణశాఖ ప్రధాన కర్తవ్యంగా మారింది. ఇందుకోసమే కొంతకాలంగా యుద్ధ విమానాల కోసం అన్వేషిస్తున్న ఇండియన్ నేవీ… 2016లో ఎయిర్ఫోర్స్కు సమకూరిన రాఫెల్ యుద్ధ విమానాలను ఆధునీకరించి, నావికాదళానికి తగ్గట్టు తయారు చేయాలని డసాల్ట్ ఏవియేషన్ను కోరింది. దీనికి ఆ సంస్థ కూడా అంగీకరించడంతో ఫ్రాన్స్తో మన రక్షణ దేశం రక్షణ ఒప్పందానికి వేగంగా పావులు కదిపింది.
రాఫెల్-ఎం మన దేశ సైనిక సంపదను పెంచుతుందని అంచనా వేస్తున్నారు రక్షణ నిపుణులు. పశ్చిమాసియా నుంచి ఆగ్నేయాసియా వరకు విస్తరించిన హిందూ మహాసముద్రం మొత్తాన్ని రాఫెల్ యుద్ధ విమానాలతో కవర్ చేయొచ్చని చెబుతున్నారు. గత ఏడాది జూన్లో అరేబియా సముద్రంలో రాఫెల్ యుద్ధ విమానాలను పరీక్షించారు.
ఐఎన్ఎస్ విక్రాంత్ డెక్పై నుంచి యుద్ధ విమానాన్ని పరీక్షించి, పూర్తి సంతృప్తి చెందడంతో కొనుగోలుకు ఆర్డర్ ఇవ్వాలని నిర్ణయించారు. దీనిద్వారా సముద్ర శక్తిగా ఆవిర్భవించాలని భావిస్తోంది మన నావికాదళం. మొత్తానికి రాఫెల్ డీల్తో నౌకాదళ సామర్థ్యం పెంచుకోవడమనే నేవీ ఆశయం కార్యరూపం దాల్చుతోంది. అంతేకాకుండా తన నేవీ బలాన్ని వేగంగా పెంచుకుంటున్న చైనాకు గట్టి షాక్ ఇచ్చినట్లైంది.
Read Also : CM Jagan : మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే – సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్