అమెరికాలో తెలుగు అమ్మాయి మృతి.. మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి, లోన్లు తీర్చేందుకు ఇప్పుడు..
రాజ్యలక్ష్మి స్వస్థలం బాపట్ల జిల్లా కారంచేడు. ఆమె విజయవాడలోని ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ చదివింది.
Rajyalakshmi
Rajyalakshmi Yarlagadda: ఆంధ్రప్రదేశ్కు చెందిన 23 ఏళ్ల విద్యార్థిని యార్లగడ్డ రాజ్యలక్ష్మి (రాజీ) అమెరికాలో అనారోగ్యంతో మృతి చెందింది. గదిలో ఆమె మృతదేహాన్ని రూమ్మేట్లు గుర్తించారు. రాజీ 2-3 రోజులుగా తీవ్రమైన దగ్గు, చాతీ నొప్పితో బాధపడినట్లు సమాచారం.
నవంబర్ 7న ఉదయం ఆమె మరణించిందని ఆమె బంధువు చైతన్య తెలిపారు. రాజీని ఇండియాకు తీసుకురావడానికి, ఆమె ఎడ్యుకేషన్ లోన్లు తీర్చడానికి గోఫండ్మీ పేజీలో ఆయన ఫండ్స్ సేకరిస్తున్నాడు.
రాజ్యలక్ష్మి స్వస్థలం బాపట్ల జిల్లా కారంచేడు. ఆమె విజయవాడలోని ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ చదివింది. 2023లో ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లింది.
ఇటీవల టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్సిటీ కార్పస్ క్రిస్టీలో కంప్యూటర్ సైన్స్లో ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగాన్వేషణలో ఉంది. మూడు రోజుల ముందు ఆమె తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఆరోగ్యం బాగోలేదని చెప్పింది.
గోఫండ్మీలో చైతన్య పేర్కొన్న వివరాల ప్రకారం.. రాజీ తన కుటుంబానికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఆశతో అమెరికాకు వెళ్లింది. కారంచేడులో ఆమె కుటుంబానికి ఉన్న చిన్న వ్యవసాయ భూమిపైనే ఆ ఫ్యామిలీ ఆధారపడి జీవిస్తోంది.
ఆమె అంత్యక్రియలు, విద్యా రుణాలు తీర్చేందుకు సాయం చేయాలని రాజ్యలక్ష్మి కుటుంబం విజ్ఞప్తి చేస్తోంది. రాజీ మరణానికి కారణాలను నిర్ధారించేందుకు వైద్య పరీక్షలు జరుగుతున్నాయి.
