UN Meet : ఆఫ్గాన్ పరిస్థితిపై భారత్ అధ్యక్షతన ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం

తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన ఆఫ్గానిస్థాన్ పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి భద్రతామండలి భారత్ అధ్యక్షతను అత్యవసర భేటీ కానుంది.

UN Meet : ఆఫ్గాన్ పరిస్థితిపై భారత్ అధ్యక్షతన ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం

Un Meet Afghanistan Situation

Updated On : August 16, 2021 / 3:49 PM IST

UN meet Afghanistan situation : తాలిబాన్లు ఆఫ్ఘనిస్థాన్ ను హస్తగతం చేసుకున్నారు.దీంతో వారి అరాచకాలకు అంతులేకుండాపోతోంది. యువతులు, మహిళలపై హింసలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయిన ఆఫ్గాన్ పరిస్థితులపై ఐక్యరాజ్యసమితి తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తోంది. దీంతో తాలిబన్లకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని ఐరాస నిర్ణయించింది. దీని కోసం ఐక్యరాజ్యసమితి భద్రతామండలి అత్యవసరంగా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈరోజు (ఆగస్టు 16,2021) రాత్రి భారత్ అధ్యక్షతన అత్యవసరంగా భేటీ కానుంది.

ఈ సమావేశంలో ఆఫ్ఘనిస్థాన్ లో ప్రస్తుత పరిస్థితులు..దీని కోసం తీసుకోవాల్సిన కార్యాచరణపై చర్చలు జరపనున్నారు. ఆప్ఘన్ ప్రజలకు హాని తలపెట్టకుండా..ప్రజల హక్కులకు భంగం వాటిల్లకుండా వ్యవహరించేలా తాలిబన్లకు స్పష్టమైన సందేశం ఇవ్వాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ కు ప్రస్తుతం భారత్ అధ్యక్షత వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆగస్ట్ 1వ తేదీన ఈ బాధ్యతలను చేపట్టిన భారత్… నెల రోజుల పాటు ఈ బాధ్యతను నిర్వహించనుంది. అయితే, భారత్ బాధ్యతలను చేపట్టిన అతి తక్కువ సమయంలోనే ఆప్ఘనిస్థాన్ లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి.

ఆగస్ట్ 6 నుంచి తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకోవడం ప్రారంభించారు. రాజధాని కాబూల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. యువతులు, మహిళలపై హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారు. వీరి అరాచకం ఎంత తీవ్రస్థాకికి చేరుకుంది అంటే..అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ రాజీనామా చేసి పలాయనం చిత్తగించిన పరిస్థితులు నెలకొన్నాయి.

వెళ్లిపోతూ వెళ్లిపోతూ అస్రాఫ్ ఘనీ దేశ ప్రజలకు ఓ మెసేజ్ ఇచ్చారు. ‘‘దేశ ప్రజలారా.. ఈరోజు నేను ఓ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. 20 ఏళ్లుగా రక్షించి నా దేశాన్ని వీడడం చాలా విచారకరం. అధ్యక్ష భవనాన్ని స్వాధీనం చేసుకునేందుకు సాయుధ తాలిబన్లు దూసుకొస్తున్నాయి. నా ముందు రెండు ప్రత్యామ్నాయాలు మాత్రమే ఉన్నాయి. అందులో ఒకటి తాలిబన్లతో పోరాడి దేశకోసం ప్రజలంతా ప్రాణాలు త్యాగం చేయడం.. కాబూల్ నగరం విధ్వంసం అవ్వడం.. ఈ రెండు పరిణామాలు జరగడం నాకు ఇష్టం లేదు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టలేను. అందుకే దేశాన్ని తాలిబన్లకు అప్పగించి నేను అధ్యక్షుడిగా తప్పుకుంటున్నాను. అని తెలిపారు.