రైనా మళ్లీ రావాలి.. చైన్నై మ్యాచ్లు గెలవాలి

ఐపీఎల్ 13వ సీజన్లో టైటిల్ ఫేవరేట్లలో ఒకటిగా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో ఓటమి నమోదు చేసుకుంది. ఇప్పటివరకు ఈ సీజన్లో మూడు మ్యాచ్లు ఆడితే.. ముంబైతో మ్యాచ్ మినహా రాజస్తాన్, ఢిల్లీతో జరిగిన మ్యాచ్ల్లో పూర్తిగా విఫలమైంది. బౌలింగ్లో ఎంతో కొంత నయంగా కనిపిస్తున్న చెన్నై బ్యాటింగ్లో మాత్రం పూర్తిగా విఫలమవుతూ వస్తుంది. మిడిలార్డర్లో డుప్లెసిస్ తప్ప ఓపెనర్లు వాట్సన్, మురళీ విజయ్, రుతురాజ్, కేదార్ జాదవ్లు తమ ఆటతీరుతో తీవ్ర నిరాశ పరుస్తున్నారు.
ధోనీ బ్యాటింగ్ అంశంపై ఇప్పటికే చర్చ నడుస్తూనే ఉంది. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఏడో స్థానంలో బ్యాటింగ్ రావడమేంటని విమర్శలు వస్తున్నాయి. ఆల్రౌండర్లుగా రవీంద్ర జడేజా, శ్యామ్ కర్జన్లు పూర్తిగా తేలిపోతున్నారు. ముంబైతో మ్యాచ్లో అంబటి రాయుడు, డుప్లెసిస్ ప్రదర్శనతో గట్టెక్కిన చెన్నై రెండో మ్యాచ్కు రాయుడు గాయంతో దూరమవ్వడంతో నాసిరక ప్రదర్శనతో సరిపెట్టుకుంటుంది.
డుప్లెసిస్ ఒక్కడే పోరాడుతున్నా.. అతనికి సహకరించేవారు కరువయ్యారు. దీంతో సురేశ్ రైనా టాపిక్ మరోసారి తెరమీదకు వచ్చింది. అతను జట్టులో ఉండి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని.. టాపార్డర్ పటిష్టంగా ఉండేదని.. చెన్నైకు ఇన్ని కష్టాలు ఉండేవి కాదని అభిమానులు అంటున్నారు. ఈ నేపథ్యంలో రైనా తిరిగి ఐపీఎల్కు రావాలంటూ సోషల్ మీడియా వేదికగా పేర్కొంటున్నారు.
‘ రైనా.. నీ అవసరం జట్టుకు ఎంతో ఉంది. మిడిలార్డర్లో నీ స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. ప్లీజ్.. రైనా తిరిగిరావా’ అంటూ సోషల్ మీడియా వేదికగా సీఎస్కే అభిమానులు వేల సంఖ్యలో మెసేజ్లు చేస్తున్నారు. ఐపీఎల్ 13వ సీజన్ ఆరంభానికి ముందే రైనా జట్టుతో కలిసి దుబాయ్కు చేరుకున్నాడు. కొన్ని వ్యక్తిగత కారణాల రిత్యా ఈ ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి దుబాయ్ నుంచి ఇండియాకు రిటర్న్ అయ్యాడు.