గంటల వ్యవధిలోనే అమ్ముడుపోయిన 2 లక్షల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు

  • Published By: bheemraj ,Published On : December 11, 2020 / 09:31 PM IST
గంటల వ్యవధిలోనే అమ్ముడుపోయిన 2 లక్షల వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు

Updated On : December 11, 2020 / 9:34 PM IST

Vaikuntha Dwara Darshanam tickets sold out : 10 రోజుల వైకుంఠ ఏకాదశి దర్శనానికి టీటీడీ కేటాయించిన 2 లక్షల టికెట్లూ గంటల వ్యవధిలోనే అమ్ముడయ్యాయి. ఈనెల 25 నుంచి వచ్చే నెల 3 వరకూ భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకోసం 300 రూపాయల టికెట్లను ఇవాళ విడుదల చేసింది. అయితే దర్శన టికెట్లు కొనుగోలు చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున ప్రయత్నించారు. దీంతో టీటీడీ సర్వర్లు మొరాయించాయి. దీంతో టికెట్లు కొనుగోలు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. అయితే.. గంటల వ్యవధిలోనే వైకుంఠ ఏకాదశి టికెట్లు అమ్ముడయిపోవడంతో భక్తులు నిరాశ చెందుతున్నారు.

డిసెంబర్ 25 ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ శుక్రవారం (డిసెంబర్ 11, 2020) శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టికెట్లను విడుదల చేసింది. ఉదయం 6.30 గంటల నుంచి టికెట్లు టీటీడీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది 10 రోజులపాటు వైకుంఠ ద్వార దర్శనం అవకాశం కల్పించనున్నారు. ఈనెల 25 నుంచి జనవరి 3 వరకు వైకుంఠ ద్వారం నుంచి స్వామివారిని భక్తులు దర్శించుకోవచ్చు. ప్రతి రోజు 20 వేల టికెట్లను అందుబాటులో ఉంచుతున్నారు.

వైష్ణవ సంప్రదాయాన్ని పాటిస్తూ ఎక్కువ‌మంది భ‌క్తుల‌కు వైకుంఠ ద్వార ద‌ర్శనం చేసుకోవాడానికి అనువుగా శ్రీవారి ఆల‌యంలోని వైకుంఠ ద్వారాన్ని ప‌ది రోజుల పాటు తెర‌చి ఉంచాల‌ని టీటీడీ నిర్ణయించింది. దీంతో డిసెంబ‌ర్‌ 25న వైకుంఠ ఏకాద‌శి కావడంతో ఆరోజు నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచి భ‌క్తుల‌కు ద‌ర్శనభాగ్యం క‌ల్పిస్తారు.