భారత్ బంద్ విజయవంతం : రైతులను చర్చలకు పిలిచిన అమిత్షా

Bharat Bandh-Amit Shah Calls Farmers For Talks : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చేపట్టిన భారత్ బంద్ విజయవంతంగా ముగిసింది. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు బంద్ నిర్వహించారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రైతులను చర్చలకు ఆహ్వానించారు. ఈరోజు (మంగళవారం)రాత్రి 7 గంటలకు రైతు సంఘాలతో అమిత్ షా చర్చలు జరపనున్నారు. షెడ్యూల్ ప్రకారం బుధవారం జరగాల్సిన చర్చలను మంగళవారమే నిర్వహించనున్నారు.
ఆందోళనలను సాధ్యమైనంత త్వరగా చల్లార్చాలని కేంద్రం భావిస్తోంది. ఇప్పటికే ఐదు సార్లు రైతు సంఘాలతో కేంద్రం చర్చలు జరిపింది. ఆరోసారి రైతులతో చర్చలు జరిపేందుకు అమిత్ షా అహ్వానించారు. రాకేశ్ తాకియాత్ అనే రైతు నేతకు కేంద్రం నుంచి ఫోన్ కాల్ వచ్చిందని చెప్పారు. అమిత్ షా తమను చర్చలకు పిలిచినట్టు ఆయన తెలిపారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు అమిత్ షాతో చర్చించనున్నట్టు పేర్కొన్నారు.
ఢిల్లీకి సమీపంలోని హైవేల్లో బంద్ కార్యక్రమాల్లో పాల్గొనే రైతు నేతలంతా షాతో భేటీ కానున్నారని తాకియత్ తెలిపారు. మరోవైపు రైతు సంఘాల బంద్కు ప్రతిపక్ష పార్టీలు సైతం మద్దతు పలికాయి. గత శుక్రవారం కేంద్రం, రైతుల మధ్య ఏడు గంటల పాటు జరిగిన చర్చలు విఫలమయ్యాయి.
దేశవ్యాప్తంగా ఢిల్లీ-హరియాణా సరిహద్దుల్లోని సింఘు, ట్రికీ రహదారుల్లో వేలాది మంది బైఠాయించి శాంతియుతంగా ఆందోళన చేశారు. మార్కెట్లన్నీ మూతబడ్డాయి. దుకాణాలు మూసివేశారు. దేశంలో పలు చోట్ల రైలు, రవాణా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది.