Rajasthan : పెళ్లైన 54 ఏళ్లకు తల్లితండ్రులైన వృధ్ధ దంపతులు
రాజస్దాన్ కు చెందిన ఒక జంట పెళ్లైన 54 ఏళ్ళకు అమ్మానాన్న అయ్యారు.
Rajasthan : పెళ్లైన ప్రతి జంట తమకు బిడ్డలు పుట్టాలని వారితో ఆటలాడుకుని వారిని ప్రయోజకులను చేయాలని కలలు కంటారు. పెద్దలు కూడా అలాగే ఆశీర్వదిస్తారు. కానీ రాజస్దాన్ కు చెందిన ఒక జంట పెళ్లైన 54 ఏళ్ళకు అమ్మానాన్న అయ్యారు.
వివరాల్లోకి వెళితే … రాజస్ధాన్ లోని అల్వార్ లో నివసించే గోపీచంద్(75) ఆయన భార్య చంద్రావతీ దేవి (70) లకు 54 ఏళ్ల క్రితం వివాహం అయ్యింది. అప్పటి నుంచి అమ్మానాన్నలుగా మారి పిల్లలను కని పెంచాలని చాలా ఉత్సుకతతో ఉన్నారు. దురదృష్టవశాత్తు వారికి ఆ అదృష్టం కలగలేదు.
54 ఏళ్లపాటు వారు ఎదురు చూడాల్సి వచ్చింది. ఆ క్రమంలో ఈ దంపతుల కల గత సొమవారం సాకారమయ్యింది. ఐవీఎఫ్ పద్దతిలో గర్భం దాల్చిన చంద్రావతీ దేవీ సోమవారం పండటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారని ఆమెకు చికిత్స అందించన డాక్టర్ పంకజ్ గుప్తా తెలిపారు. గతంలో రెండు సార్లు ఇదే పద్ధతిలో చంద్రావతీ దేవీ గర్భం దాల్చిందని… అయితే కొన్ని కారణాల వల్ల గర్భస్రావం జరిగినట్లు డాక్టర్ వివరించారు.
గత సోమవారం పుట్టిన బిడ్డ ఆరోగ్యంగా ఉండి 3.5 కేజీల బరువు ఉన్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా గోపీ చంద్ మాట్లాడుతూ బంధువుల ద్వారా ఐవీఎఫ్ విధానం తెలుసుకుని డాక్టర్ ను సంప్రదించామని… ఇన్నేళ్లకైనా తండ్రిని అయినందుకు సంతోషంగా ఉందన్నారు. కాగా భారతదేశంలో జూన్ 2022 నుండి అమల్లోకి వచ్చిన ఒక చట్టం ప్రకారం 50 ఏళ్లు పైబడిన మహిళలకు, పురుషులకు ఐవీఎఫ్ ద్వారా చికిత్స అందించటం నిషిధ్దం. అయితే ఈ చట్టం రాకముందే గతేడాదే చంద్రావతి గర్భం దాల్చటం వల్ల ఆ దంపతులు అదృష్ట వంతులయ్యారు.
Also Read : Azadi Ka Amrit Mahotsav : రాజమండ్రిలో అతి పెద్ద జెండా ప్రదర్శన