Petrol Price Hike: సెంచరీ దాటినా ఆగని పెట్రో పరుగులు..!
దేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో పెట్రోల్ ధరలు సెంచరీ దాటినా ధరల పరుగులు మాత్రం ఆగడంలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మొదలైన ధరల పెరుగుదల ఇప్పటికీ పైపైకి వెళ్తూనే ఉంది. ఎన్నికల అనంతరం ఇప్పటికి 23 సార్లు పెంచిన చమురు కంపెనీలు శుక్రవారం మరోసారి ధరలు పెంచాయి.
Petrol Price Hike: దేశంలో ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో పెట్రోల్ ధరలు సెంచరీ దాటినా ధరల పరుగులు మాత్రం ఆగడంలేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం మొదలైన ధరల పెరుగుదల ఇప్పటికీ పైపైకి వెళ్తూనే ఉంది. ఎన్నికల అనంతరం ఇప్పటికి 23 సార్లు పెంచిన చమురు కంపెనీలు శుక్రవారం మరోసారి ధరలు పెంచాయి. దీంతో చమురు ధరలు ఆల్ టైం రికార్డు స్థాయికి చేరాయి. నేడు (జూన్ 11) పెట్రోల్ పై 29 పైసలు, డీజిల్ పై 28 పైసలు ధర పెరిగింది.
దేశంలో ఇప్పటికే చాలా నగరాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ దాటగా మరొకొన్ని చోట్ల సెంచరీకి చేరువలో ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, జమ్మూకాశ్మీర్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100 కంటే ఎక్కువే ఉండగా దేశంలోనే అత్యధికంగా రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో లీటర్ పెట్రోల్ ధర రూ.106 పలుకుతుంది. దేశరాజధాని న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.95.85కు పెరగగా ఆర్ధిక రాజధాని ముంబైలో పెట్రోల్ రూ.101.04, డీజిల్ రూ.94.15గా ఉన్నాయి.
అసలే కరోనా కారణంగా ఆర్ధికంగా చితికిపోయిన మధ్య తరగతి కుటుంబాలు పెట్రోల్ ధరల పెరుగుదలతో మరింత కృంగిపోతున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు పెరిగిన ధరల ప్రభావం రైతులపై ఎక్కువగా చూపే అవకాశం ఉంది. పంటలు వేసే సీజన్ కావడంతో రైతులపై డీజిల్ రేట్ల ప్రభావం అధికంగా ఉంటుంది. గతేడాది జూన్ నెలలో రూ.80కి లభించిన డీజిల్ 2021 జూన్ వచ్చే సరికి రూ.15 పెరిగి రూ. 95 దాటిందంటే వ్యవసాయంపై ఈ ధరల ప్రభావం ఎంత ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.