ప్రమోషన్ రాలేదన్న మనస్తాపంతో, తెలంగాణ ఐపీఎస్ అధికారి వీకే సింగ్ రాజీనామా
తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ పదవికి ఐపీఎస్ అధికారి వీకే సింగ్(వినోద్ కుమార్ సింగ్) రాజీనామా చేశారు.

తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ పదవికి ఐపీఎస్ అధికారి వీకే సింగ్(వినోద్ కుమార్ సింగ్) రాజీనామా చేశారు.
తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ పదవికి ఐపీఎస్ అధికారి వీకే సింగ్(వినోద్ కుమార్ సింగ్) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కి పంపారు. డీజీపీగా ప్రమోషన్ రాలేదన్న మనస్తాపంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. తన పదోన్నతికి సంబంధించిన విషయంలో కొంతకాలంగా తెలంగాణ ప్రభుత్వంపై వీకే సింగ్ అసంతృప్తితో ఉన్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజున పదవీ విరమణ(ప్రీ రిటైర్మెంట్) చేసేందుకు అనుమతించాలని కోరుతూ కేంద్ర హోమ్ శాఖ కార్యదర్శికి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, ఆయన తన రాజీనామా లేఖను పంపించారు.
ఐపీఎస్ గా ఫెయిల్ అయ్యాను:
తాను 1987 బ్యాచ్ ఐపీఎస్ అధికారినని తన లేఖలో ప్రస్తావించిన వీకే సింగ్, పోలీసు శాఖలో సంస్కరణలు తేవాలని భావించానని, కానీ ఆశయ సాధనలో విఫలమయ్యానని ఆయన వాపోయారు. దశాబ్దాల తన సర్వీసులో ఎన్నో విషయాలు నేర్చుకున్నానని, స్పష్టమైన మనస్సాక్షితో విధులు నిర్వహించానని తెలిపారు. కష్టపడటం, నిజాయితీతో ఉండటంతో విజయాలను సాధించవచ్చని గ్రహించానని, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలని భావిస్తే పోలీసు శాఖలోనే చేరాలని సూచించారు.
డీజీపీ గా ప్రమోషన్ రాలేదని మనస్తాపం:
వీకే సీంగ్ గతంలో జైళ్లశాఖ డైరెక్టర్ జనరల్ గా పనిచేశారు. ఆపై ఆయన్ను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగానికి మార్చారు. దీనిపై మీడియా సమావేశం పెట్టి మరీ తన ఆవేదనను బహిర్గతం చేసి సంచలనం సృష్టించారు వీకే సింగ్. ఆ తర్వాత ఆయన్ను పోలీస్ అకాడమీకి మార్చగా, విధుల్లో చేరిన తొలి రోజునే, అకాడమీ డంపింగ్ యార్డులో ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు డీజీపీగా ప్రమోషన్ ఇవ్వాలని సీఎస్ కు ఆయన లేఖ రాసినా, స్పందన రాలేదు. తాను పదోన్నతికి పనికి రానంటే, పదవికే రాజీనామా చేసేందుకు సిద్ధమని గతంలోనే ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రమోషన్ ఇవ్వకుంటే రిజైన్ చేస్తానని చెప్పిన ఆయన, తాజాగా, రాజీనామా లేఖను పంపడం గమనార్హం. వాస్తవానికి వీకే సీంగ్ 2020 నవంబర్ లో రిటైర్ కావాల్సి ఉంది.
అసలేం జరిగిందంటే:
తన పదోన్నతికి సంబంధించి మే 21న తెలంగాణ ప్రభుత్వ సీఎస్ కు వీకే సింగ్ లేఖ రాశారు. ఆ లేఖ కాపీని సీఎం కేసీఆర్ కు కూడా పంపారు. తనకు పదోన్నతి కల్పించాలని అందుకు తనకు అన్ని అర్హతలు ఉన్నాయని ఆ లేఖలో ప్రభుత్వానికి విన్నవించారు. నిబంధనల ప్రకారం 33 ఏళ్ల పాటు సేవలు అందించిన సీనియర్ ఐపీఎస్ అధికారిగా తాను డీజీపీ పదవికి అర్హుడిని అంటూ లేఖలో ప్రభుత్వానికి తెలిపారు వీకే సింగ్. కాగా, పోలీసు అకాడెమీ కోసం తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఖర్చు వృథా అని, పోలీసు అకాడెమీ వల్ల పెద్ద ఉపయోగం లేదని గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు పోలీసు శాఖలో పెను దుమారమే రేపాయి.
Read: కరోనా టెస్టుల కోసం జనాల పరుగులు..ప్రైవేట్ ల్యాబ్స్ కిటకిట