ఈ చీరతో కరోనాకు చెక్ !

కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో దేశంలో ప్రతి ఒక్కరు రోగ నిరోధక శక్తి పెంచుకునే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి రకరకాల ఇమ్యూనిటీ బూస్టర్లు వచ్చాయి. అయితే మధ్యప్రదేశ్లో మాత్రం వెరైటీగా రోగ నిరోధకత పెంచే చీరలు వచ్చాయి. రోగ నిరోధక శక్తి పెంచే చీరలను ‘ఆయుర్వస్త్రా’ పేరుతో మధ్యప్రదేశ్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ మార్కెట్లోకి తీసుకువచ్చింది.
రకరకాల సుగంధ ద్రవ్యాలతో వీటిని తయారు చేశామని.. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. చీరలు మాత్రమే కాక ఇతర దుస్తులను కూడా తయారు చేశామన్నారు. వీటిని ధరించడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని.. ఫలితంగా కరోనా వైరస్ దరిచేరదని కార్పొరేషన్ అధికారులు అంటున్నారు.
రోగ నిరోధక శక్తిని పెంచే చీరల తయారిని మధ్యప్రదేశ్ ప్రభుత్వం భోపాల్కు చెందిన వస్త్ర నిపుణుడు వినోద్ మాలేవర్కి అప్పగించింది. ఈ చీరలు తయారు చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవడమే కాక ఎంతో నైపుణ్యం అవసరమని మాలేవర్ అన్నారు. లవంగాలు, యాలకులు, జాపత్రి, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు, రాయల్ జీలకర్ర, బే ఆకు వంటి సుగంధ ద్రవ్యాలను ఈ దుస్తుల తయారికి వాడినట్లు వెల్లడించారు.
వీటన్నింటిని పొడి చేసి 48 గంటల పాటు నీటిలో నానబెడతారు. తరువాత దీన్ని మరగబెట్టి.. దాని నుంచి వచ్చిన ఆవిరిని చీర, మాస్క్ లేదా ఇతర దుస్తులు తయారు చేసే వస్త్రానికి పట్టిస్తారు. ఇది కొన్ని గంటలపాటు జరుగుతుంది. తర్వాత ఆవిరి పట్టించిన వస్త్రంతో చీర, మాస్క్, ఇతర దుస్తులు తయారు చేస్తారు. ఈ పద్ధతిలో ఒక చీర తయారు చేయడానికి 5-6 రోజులు పడుతుందని చెప్పారు.
ఈ సందర్భంగా వినోద్ మాలేవర్ మాట్లాడుతూ.. ‘ఇది వందల ఏళ్ల నాటి పురాతన పద్ధతి అన్నారు. ఈ బట్టల వల్ల వైరస్ వ్యాప్తి తగ్గిపోతుందని పేర్కొన్నారు. ఈ దుస్తులను ధరించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. ఈ రకం దుస్తులను తయారు చేయడానికి దాదాపు రెండు నెలల పాటు శ్రమించి ఈ పద్ధతిని కనుగొన్నామని పేర్కొన్నారు. ఈ దుస్తులలో రోగ నిరోధక శక్తి పెంచే ప్రభావం నాలుగైదు ఉతుకుల వరకు ఉంటుందని మాలేవర్ తెలిపారు.
మధ్యప్రదేశ్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండిక్రాఫ్ట్ కార్పొరేషన్ కమిషనర్ రాజీవ్ శర్మ మాట్లాడుతూ ఆరోగ్యం, రోగ నిరోధక శక్తిని పెంచే పురాతన వస్త్రాల తయారీ విధానాన్ని పునరుద్ధరించడానికి తమకు అవకాశం లభించిందన్నారు. కరోనా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోందని తెలిపారు. ఇలాంటి సమయంలో తాము ప్రజలకు మేలు చేసే హెర్బల్ దుస్తులను మార్కెట్లోకి తెచ్చామని చెప్పారు. ప్రస్తుతం రోగ నిరోధకత పెంచే ఈ చీర ధర 3 వేల రూపాయలు అన్నారు.
అంతేకాక ప్రస్తుతం తాము ఈ చీరలను భోపాల్, ఇండోర్లలో విక్రయిస్తున్నామని.. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్న తమ 36 షోరూమ్లలో విక్రయిస్తామని రాజీవ్ శర్మ తెలిపారు. అయితే ఈ చీరలు, మాస్క్లు ధరించడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని నిరూపించడానికి ఎలాంటి వైద్య ఆధారాలు లేవన్నారు. ముఖ్యంగా ఈ దుస్తులు కరోనా వైరస్ సంక్రమించకుండా కాపాడతాయని చెప్పడానికి ఎలాంటి ఆధాలు లేకపోవడం గమనార్హం.