MAA elections : నరేష్ VS శివాజీ రాజా

‘మా’లో ఎన్నికల వేడి రగులుకుంది. రాజకీయ నేతల్లాగే వీరు కూడా పంచ్ డైలాగ్లు విసురుతున్నారు. అప్పటి వరకు దోస్త్లుగా ఉన్న వారు ప్రత్యర్థులుగా మారిపోయారు. ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. గతంలో ఏమీ చేయలేదు..తాము వస్తే ఇది చేస్తాం..అది చేస్తామంటూ హామీల మీద హామీలు గుప్పించేస్తున్నారు. మార్చి 10వ తేదీన జరిగే ఎన్నికల కోసం ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. అగ్ర నటులను, ఇతరులను కలిసి తమకే ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు.
శివాజీ రాజా vs నరేష్ వర్గం ఢీకొంటున్నాయి. ‘మా’ అధ్యక్షులు శివాజీ రాజా పదవీ కాలం పూర్తికావడంతో ఎన్నికలు సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే శివాజీ రాజా తన ప్యానెల్ సిద్ధం చేయగా నరేశ్ సైతం తన బ్యాచ్ ను సిద్ధం చేశారు. అధ్యక్ష, కార్యదర్శుల పదవులకు పోటీ చేసిన వీరు ప్రస్తుతం ప్రత్యర్థులుగా మారిపోయారు. నరేష్ అధ్యక్షుడిగా, రాజశేఖర్ వైస్ ప్రెసిడెంట్గా, జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్లు ‘మా’ ఎన్నికలకు నామినేషన్లు వేశారు. ఇప్పటికే సినీ రంగంలో నరేష్, శివాజీ వర్గాలుగా విడిపోయాయి. గతంలో ఉన్న వివాదాలు తెరపైకి వస్తున్నాయి.
ఒప్పందాలను తుంగలో తొక్కి శివాజీ రాజా డ్రామాలు ఆడుతున్నాడని, తనకు ఛాన్స్ ఇవ్వాలని ముందే తీర్మానం చేసినా మళ్లీ శివాజీ పేచి పెట్టారంటూ నరేష్ ఆరోపణలు గుప్పించారు. కుర్చీ రాజకీయం పెట్టుకోవద్దని..కొత్త ఆలోచనతో ముందుకు రావాలని రాజేంద్ర ప్రసాద్ హుందాగా తప్పుకున్నారని గుర్తు చేశారు. నరేష్ ఖచ్చితంగా చేయాలని స్వయంగా శివాజీ చెప్పినట్లు, కొందరిలో అసంతృప్తి రాజ్యం ఏలుతోందని..గతంలో జరిగిన విషయాలు తాను చెప్పదల్చుకోవడం లేదన్నారు. ‘మా’ కోసం మంచి జరగాలని పోటీ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తమ హామీలను వంద శాతం అమలు చేస్తామంటూ ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. మాలో మహిళలకు పదవులు లేవని జీవిత రాజశేఖర్ తెలిపారు. దీనిని శివాజీ రాజా ఖండించారు. ఒక్క పైసా అవినీతి జరగకుండా మాలో పదవి నిర్వహించినట్లు చెప్పారు.
శివాజీ రాజాకు శ్రీకాంత్తో పాటు ఎస్వీ కృష్ణారెడ్డి, పరుచూరి వెంకటేశ్వరావు, రఘుబాబు వంటి సినీ పెద్దలు సపోర్ట్గా నిలిచారు. 800 మందికిపైగా సభ్యులున్న నటీనటుల సంఘానికి మార్చి 10న ఎన్నికలు జరగనున్నాయి. మరి ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడుతారో చూడాలి మరి.