Dhanush: AI ఉపయోగం ఆందోళన కలిగించే అంశం, ఆ సినిమా క్లైమాక్స్‌ మార్పు కలతకు గురి చేసింది- ధనుష్‌ సంచలన వ్యాఖ్యలు

ఏఐ వినియోగానికి తాను అభ్యంతరం తెలిపినప్పటికీ సంబంధిత పార్టీలు ఈ విషయంలో ముందుకెళ్లాయంటూ ధనుష్ తెలిపారు.

Dhanush: AI ఉపయోగం ఆందోళన కలిగించే అంశం, ఆ సినిమా క్లైమాక్స్‌ మార్పు కలతకు గురి చేసింది- ధనుష్‌ సంచలన వ్యాఖ్యలు

Updated On : August 3, 2025 / 11:20 PM IST

Dhanush: ఇప్పుడు ఎక్కడ చూసినా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) గురించి చర్చ జరుగుతోంది. ఏఐ వాడకం పెరిగిపోతోంది. ఆ రంగం ఈ రంగం అని కాకుండా దాదాపు అన్నింటిలో ఏఐ వాడేస్తున్నారు. ఏఐ వాడకంతో గణనీయంగా మార్పులు జరుగుతున్నాయి. అయితే, కొన్ని సందర్భాల్లో ఏఐ వాడకంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దీని వల్ల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. తాజాగా ఓ సినిమా క్లైమాక్స్ కు సంబంధించి ఏఐ వాడకంపై ప్రముఖ సినీ నటుడు ధనుష్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

మ్యాటర్ లోకి వెళితే.. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI)తో రూపొందించిన క్లైమాక్స్‌తో ‘రాంఝనా’ సినిమాను రీ రిలీజ్‌ చేశారు. దీనిపై ధనుష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐతో రూపొందించిన క్లైమాక్స్‌తో రాంఝనా సినిమాను రీ రిలీజ్‌ చేయడం తనను కలతకు గురిచేసిందని ధనుష్ వాపోయారు. ఇది ఆ సినిమా ఆత్మనే కోల్పోయేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారాయన.

ఏఐ వినియోగానికి తాను అభ్యంతరం తెలిపినప్పటికీ సంబంధిత పార్టీలు ఈ విషయంలో ముందుకెళ్లాయంటూ ధనుష్ తెలిపారు. 12 ఏళ్ల క్రితం తాను కమిట్‌ అయిన సినిమా ఇది కాదన్నారు. సినిమాల్లో కంటెంట్‌ను మార్చడానికి ఏఐని ఉపయోగించడం కళ, కళాకారులు.. ఇద్దరికీ తీవ్ర ఆందోళన కలిగించే అంశమన్నారు. ఇది కథ చెప్పే విధానానికి, సినిమా వారసత్వానికి ప్రమాదకరం అని హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి పద్ధతులను నివారించేందుకు కఠినమైన నిబంధనలను అమలు చేస్తారని తాను ఆశిస్తున్నట్లు ధనుష్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు పెట్టారు. ఏఐ వినియోగంపై ధనుష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి.

అంబికాపతి పేరుతో రాంఝనా సినిమా తమిళ వెర్షన్ ఆగస్టు 1న థియేటర్లలో రీ రిలీజ్ అయ్యింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి ప్రత్యామ్నాయ, సంతోషకరమైన ముగింపును ఇందులో సృష్టించారు. రాంఝనా తమిళ వెర్షన్ అంబికాపతి కొత్త AI- జనరేటెడ్ ముగింపులో ధనుష్ పాత్ర కుందన్‌ను సజీవంగా చూసి అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.

Also Read: వాళ్ళను షూటింగ్ లకు వెళ్ళొద్దని లెటర్ రిలీజ్.. మళ్ళీ టాలీవుడ్ లో సమ్మె..

”రాంఝనా కొత్త AI- జనరేటెడ్ క్లైమాక్స్‌తో అందమైన ట్విస్ట్‌ను కలిగుంది. ఇది చాలా వాస్తవికంగా ఉంది. కుందన్ సజీవంగా ఉన్నాడు. ఈ కాలాతీత కథ పట్ల మనకున్న ప్రేమ కూడా అలాగే ఉంది. అభిమానులు వారు ఎల్లప్పుడూ కోరుకునే ముగింపును AI ఇచ్చింది” అని కొందరు నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఏఐ జనరేటెడ్ క్లైమాక్స్ తో అభిమానులు ఖుషీగానే ఉన్నా.. హీరో ధనుష్ మాత్రం అసంతృప్తి వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.