Vijayendra Prasad : కనీసం ఆ సినిమాలకైనా తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులు ఇవ్వాలి..
తాజాగా తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో 'టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023' అనే వేడుకలు దుబాయ్లో నిర్వహిస్తామని తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ చైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు.

Vijayendra Prasad comments on Telangana Government Nandi Awards
Vijayendra Prasad : తెలుగు(Telugu) రాష్ట్రం విడిపోయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున ఇచ్చే అత్యున్నత సినీ పురస్కారం నంది అవార్డులు(Nandi Awards) ఓ రెండేళ్లు ఏపీ(AP) ప్రభుత్వం తరపున ఇచ్చారు. చివరిసారిగా 2016లో నంది అవార్డుల వేడుక జరిగింది. ఆ తర్వాత రెండు ప్రభుత్వాలు నంది అవార్డులను పట్టించుకోలేదు. కానీ గత కొన్ని నెలలుగా సినీ పరిశ్రమలోని ప్రముఖులు నంది అవార్డులు ఇవ్వాలని మాట్లాడుతున్నారు. ప్రభుత్వాలను కూడా కోరారు. గత వారం రోజులుగా ఈ నంది అవార్డులపై ఇటు సినిమా వాళ్ళు, అటు రాజకీయనాయకులు పలు రకాల కామెంట్స్ చేస్తుండటంతో నంది అవార్డ్స్ వార్తల్లో నిలుస్తుంది.
తాజాగా తెలంగాణ ప్రభుత్వం సహకారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్’ ఆధ్వర్యంలో ‘టీఎఫ్సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023’ అనే వేడుకలు దుబాయ్లో నిర్వహిస్తామని తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ చైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు. నేడు TFCC నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023 బ్రోచర్ ను ఈ రోజు ఫిలించాంబర్ లో ప్రముఖ రచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో విజయేంద్రప్రసాద్ మాట్లాడుతూ…. గత కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డ్స్ ని మళ్లీ ప్రతాని రామకృష్ణ గారు ప్రభుత్వ సహకారంతో ఇవ్వడం సంతోషకరం. అయితే తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తీసే చిత్రాలకు స్పెషల్ గా నంది అవార్డ్ కేటాయిస్తే బావుంటుందన్నది నా ఆలోచన. అలాగే తెలంగాణలో అద్భుతమైన టూరింగ్ స్పార్ట్స్ ఉన్నాయి. వాటిని బేస్ చేసుకుని 90 శాతం అక్కడే షూటింగ్ చేసే సినిమాలకు నంది అవార్డ్స్ తో పాటు నగదు ప్రోత్సాహకాలిస్తే మరిన్ని చిత్రాలు రూపొందడంతో పాటు తెలంగాణలో టూరిజం పెరిగే అవకాశం ఉంటుంది అని అన్నారు.
ఈ కార్యక్రమంలో TFCC చైర్మన్ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ… TFCC నంది అవార్డ్స్2021, 22 సంవత్సరాలకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులతో జ్యూరీ కమిటీని ఏర్పాటు చేసి అర్హులకు ఈ అవార్డ్స్ ఇవ్వనున్నాం. ఈ అవార్డ్స్ ఫంక్షన్ దుబాయ్ లో గ్రాండ్ గా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దుబాయ్ ప్రిన్స్ చేతుల మీదుగా నంది అవార్డులు ఇప్పించాలనుకుంటున్నాం. 2021, 22 సంవత్సరంలో విడుదలైన చిత్రాల వాళ్లు వీటికి అప్లయ్ చేసుకోవచ్చు. ప్రముఖులతో ఏర్పాటు అయిన కమిటీ మెంబర్స్ చిత్రాలను చూసి అర్హులు అనుకున్న వారికి అవార్డ్స్ ప్రకటిస్తాం. దుబాయ్ ప్రిన్స్ డేట్ తీసుకుని త్వరలో అవార్డ్స్ డేట్ అధికారికంగా ప్రకటిస్తాం అని తెలిపారు.