లోక్ పాల్ ఎప్పుడు? : అన్నా హజారే దీక్ష ప్రారంభం

లోక్ పాక్ చట్టంపై మరోసారి కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే రెడీ అయ్యారు. మహారాష్ట్ర లోని రాలేగావ్ సిద్ధిలోని తన నివాసంలో మంగళవారం(జనవరి 30, 2019) నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. రాష్ట్రాల్లో లోకాయుక్త, కేంద్రంలో లోక్ పాల్ వెంటనే ఏర్పాటు చేయాలన్న డిమాండ్ తో హజారే దీక్షకు దిగారు. ఇవాళ మహాత్మ గాంధీ 71వ వర్థంతి, అమరవీరుల దినోత్సవం సందర్భంగా అన్నా హజారే దీక్ష ప్రారంభించడం విశేషం.
లోక్ పాల్ చట్టం అమల్లోకి వస్తే ప్రధాని స్థాయి వ్యక్తులు సైతం విచారణ నుంచి తప్పించుకోలేరని, ప్రజల దగ్గర ఖచ్చితమైన ఆధారాలు ఉంటే ప్రధాని పైన కూడా విచారణ జరిపించవచ్చని హజారే తెలిపారు. అలాగే లోకాయుక్త పరిధిలో ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెుల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులపై ఎవరైనా తగిన ఆధారాలు సమర్పిస్తే వెంటనే విచారణ జరిపించవచ్చన్నారు. తమ వేదికపై రాజకీయనాయకులకు చోటిచ్చే ప్రశక్తే లేదని ఆయన సృష్టం చేశారు. 2013లో యూపీఏ-2 హయాంలోనే లోక్ పాల్ బిల్లుకు పార్లమెంట్ లో ఆమోదం లభించింది. అయితే ఇప్పటివరకు దానికి సంబంధించి నియామకాలు జరుగలేదు.