ఏప్రిల్ 1నుంచి తెలంగాణలో పెళ్లిళ్లు జరగవు: కేసీఆర్

ఏప్రిల్ 1నుంచి తెలంగాణలో పెళ్లిళ్లు జరగవు: కేసీఆర్

Updated On : March 14, 2020 / 6:02 PM IST

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్‌ నుంచి బయటపిపడేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. వీటిని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారు. మార్చి 31 వరకు అన్ని విద్యా సంస్థలు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల అవసరాల దృష్ట్యా సూపర్‌ మార్కెట్లు, మాల్స్‌ తెరిచే ఉంచుతామని తెలిపారు. పెళ్లిళ్లు ఇది వరకే నిర్ణయమై ఉన్న నేపథ్యంలో 31 వరకు మాత్రమే వివాహ మండపాలు తెరిచి ఉంచుతామని, ఆ తర్వాత అనుమతించబోమని స్పష్టంచేశారు. 

కరోనా వైరస్‌ కట్టడి కోసం తెలంగాణ కేబినెట్‌ సమావేశమైంది. 3గంటల పాటు సుదీర్ఘంగా చర్చించిన అనంతరం సీఎం కేసీఆర్‌.. మన రాష్ట్రంలో కరోనా ప్రభావం లేదు. ఒకరు కరోనా వైరస్‌ వచ్చి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరొకరు చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు దేశంలో 83 మందికే వచ్చింది. అందులో భారతీయులు 66 మంది ఉన్నారు. 17 మంది విదేశీయులు ఉన్నారు. ఇద్దరు మాత్రమే చనిపోయారు. వీరంతా విదేశాల నుంచి వచ్చిన వారే. 

జన సమూహం ఎక్కువగా ఉన్న ప్రదేశాలకు దూరంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నాం. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఎంత ఖర్చు అయినా కేటాయించాలనుకుంటున్నాం. ప్రాథమికంగా రూ.500 కోట్లు వెచ్చించాలని క్యాబినెట్‌ నిర్ణయించింది. ఎలాంటి పరిస్థితి వచ్చినా వినియోగించేందుకు వీలుగా సీఎస్‌కు ఆ అధికారాలు ఇచ్చాం. ఆరోగ్య శాఖ సన్నద్ధంగా ఉంది. విదేశాల నుంచి వస్తున్న వారితోనే ఈ వైరస్‌ వస్తోంది. ముఖ్యంగా వీరంతా ఎయిర్‌పోర్టు నుంచి వస్తున్నారు. అందువల్ల శంషాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం. 

ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. రాష్ట్రంలో 1020 ఐసోలేషన్‌ బెడ్స్‌ అందుబాటులో ఉంచాం. మరో 321 ఐసీయూ బెడ్స్‌ ఉంచాం. ఇంకో 240 వెంటిలేటర్లు సిద్ధంగా ఉంచాం. రాష్ట్రంలో క్వారంటైన్‌ ఉంచడానికి 4 ఆస్పత్రులు సిద్ధంగా ఉన్నాయి. వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశాం.

పెళ్లిళ్లకు 200 మంది మాత్రమే..
పెళ్లి మండపాలు కూడా మూసివేయాలని నిర్ణయించాం. అయితే ఇప్పటికే పెళ్లిళ్ల డేట్ ఫిక్స్ అయి ఉంటాయ్‌ కాబట్టి వాటిపై కూడా నిషేధం నిలిపివేశాం. 200మంది మించకుండా వివాహం చేసుకోవాలి. మార్చి 31 వరకు మాత్రమే ఈ అవకాశం. ఆ తర్వాత మ్యారేజ్‌ హాల్స్‌కు కూడా అవకాశం ఇవ్వబోం.
 
బహిరంగ సభలు, వర్క్‌షాపులు, ర్యాలీలు వంటివి అనుమతించబోం. జిమ్‌లు, జూ పార్క్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌, మ్యూజియం, అమ్యూజ్‌మెంట్‌ పార్కులు, అన్ని రకాల స్పోర్ట్స్‌ ఈవెంట్లు రద్దు చేస్తున్నాం. సినిమా హాళ్లు, పబ్బులు, క్లబ్బులు, బార్లు మూసివేస్తున్నాం. ఆర్టీసీ బస్సులు, మెట్రో యథావిధిగా నడుస్తాయి’ అని ప్రజలకు సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.