బీజేపీ దురాగతాల నుంచి రైతులకు విముక్తి.. కాంగ్రెస్ హామీ

రైతులకు 5 ప్రధాన హామీలతో కిసాన్ న్యాయ్ పేరుతో హామీపత్రాన్ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు.

బీజేపీ దురాగతాల నుంచి రైతులకు విముక్తి.. కాంగ్రెస్ హామీ

Updated On : March 14, 2024 / 6:26 PM IST

Kisan Nyay: లోక్‌స‌భ‌ ఎన్నికల నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం ముమ్మరం చేశాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు వాగ్దానాల వర్షం కురిపిస్తున్నాయి. ముఖ్యంగా రైతులను ఆకర్షించేందుకు హామీలు గుప్పిస్తున్నాయి. అధికారంలోకి వస్తే రైతులకు అన్నివిధాలా న్యాయం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీయిచ్చింది. 5 ప్రధాన అంశాలతో
కిసాన్ న్యాయ్ పేరుతో హామీపత్రాన్ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. దేశంలోని 62 కోట్ల మంది రైతులను బీజేపీ దురాగతాల నుంచి విముక్తి చేస్తామని ఈ సందర్భంగా ఆయన ప్రకటించారు.

కిసాన్ న్యాయ్ ద్వారా ప్రతి రైతు జీవితంలో మళ్లీ సంతోషాన్ని నింపుతామన్నారు. స్వామినాథన్ కమిషన్ ఫార్ములా ప్రకారం MSPకి చట్టబద్ధత కల్పిస్తామని హామీయిచ్చారు. రైతుల రుణాలను మాఫీ చేయడానికి, రుణమాఫీ మొత్తాన్ని నిర్ణయించడానికి శాశ్వత ‘వ్యవసాయ రుణ మాఫీ కమిషన్’ ఏర్పాటు చేస్తామన్నారు. బీమా ప్లాన్‌ను మార్చడం ద్వారా పంట నష్టం జరిగితే 30 రోజులలోపు పరిహారాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. రైతుల కోసం ఎగుమతి-దిగుమతి విధానాన్ని రూపొందిస్తామని, వ్యవసాయ సంబంధిత వస్తువులపై జీఎస్టీని తొలగిస్తామని మల్లికార్జున ఖర్గే హామీయిచ్చారు.

మహిళా న్యాయ గ్యారంటీ కింద 5 హామీలు
1. మహాలక్ష్మి హామీ: నిరుపేద కుటుంబంలోని ప్రతి మహిళకు ఏటా రూ.లక్ష సాయం అందజేత

2. సగం జనాభా – పూర్తి హక్కులు: కేంద్ర ప్రభుత్వ కొత్త నియామకాలలో మహిళలకు సగం హక్కుల కల్పన

3. అధికారం పట్ల గౌరవం:ఈ పథకం కింద అంగన్‌వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన కార్మికుల నెలసరి వేతనానికి కేంద్ర ప్రభుత్వ సహకారం రెట్టింపు

4. సరైన స్నేహం: మహిళలకు వారి హక్కులపై అవగాహన కల్పించేందుకు, అవసరమైన సహాయం అందించేందుకు అధికార మైత్రి రూపంలో ప్రతి పంచాయతీలో పారా లీగల్ అంటే లీగల్ అసిస్టెంట్‌ నియామకం

5. సావిత్రి బాయి ఫూలే హాస్టల్: భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని జిల్లా ప్రధాన కార్యాలయాల్లో కనీసం ఒక వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌ ఏర్పాటు.. దేశవ్యాప్తంగా ఈ హాస్టల్‌ల సంఖ్య రెట్టింపు చేస్తాం