ఢిల్లీలో మరో మొహల్లా క్లీనిక్ డాక్టర్ కు కరోనా పాజిటివ్

ఢిల్లీలో మొహల్లా క్లీనిక్ లో పనిచేసే మరో డాక్టర్ కు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. ఈశాన్య ఢిల్లీలోని మౌజ్ పూర్ కి దగ్గర్లోని బాబర్ పూర్ లోని మొహల్లా క్లీనిక్ లో పనిచేసే డాక్టర్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు మంగళవారం(మార్చి-31,2020)అధికారులు తెలిపారు. వారం రోజుల వ్యవధిలో ఢిల్లీలో డాక్టర్ కు కరోనా పాజిటివ్ రావడం ఇది రెండవది.
మార్చి-12,2020 నుంచి మార్చి-20,2020 మధ్యలో బాబర్ పూర్ క్లినిక్ కు వెళ్లిన పేషెంట్లు అందరూ రాబోయే 15రోజులు తమ తమ ఇళ్లల్లో సెల్ఫీ క్వారంటైన్(స్వీయ నిర్భందం)అవ్వాలని అధికారులు తెలిపారు. ఈ మేరకు బాబర్ పూర్ లోని మొహల్లా క్లీనిక్ బయట ఓ నోటీసును కూడా అధికారులు ఉంచారు.
గత వారం ఈశాన్య ఢిల్లీలోనే ఓ డాక్టర్ కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత డాక్టర్ భార్య,కూతరుకి కూడా కరోనా సోకినట్లు నిర్థారణ అయింది. ప్రస్తుతం వీరందరూ హాస్పిటల్ లో చేరారు. వీరిని డాక్టర్లు ఐసొలేషన్ లో ఉంచారు. కరోనా సోకిన డాక్టర్ ను కలిసిన దాదాపు 800మంది ప్రజలు 14రోజుల క్వారంటైన్ లో ఉన్నారు.
మరోవైపు కరోనా వైరస్(కోవిడ్-19) బాధితుల కోసం నిర్విరామంగా కృషిచేస్తున్న డాక్టర్ల ఆరోగ్యం దృష్ట్యా ఢిల్లీ ప్రభుత్వం సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో ప్రభుత్వ హాస్పిటల్స్ అయిన లోక్ నాయక్ హాస్పిటల్ మరియు GB పంత్ హాస్పిటల్స్ లో కోవిడ్-19 డ్యూటీలో పనిచేస్తున్న డాక్టర్లను లలిత్ హోటల్లో ఉంచనున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం సోమవారం(మార్చి-30,2020) ప్రకటించింది.
లలిత్ హోటల్ ఈ రెండు హాస్పిటల్స్ కు కిలోమీటరు కన్నా తక్కువ దూరంలోనే ఉంది. ప్రాణాంతక ఈ వైరస్ డాక్టర్లు, వారి కుటుంబాలకు కూడా సోకుతున్న నేపథ్యంలో సర్కార్ ఈ ప్రణాళిక ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపింది. హోటల్ లో డాక్టర్ల వసతి ఖర్చులకు ఢిల్లీ ప్రభుత్వమే భరించనున్నట్లు సోమవారం ఢిల్లీ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ జారీ చేసిన ఆర్డర్ లో తెలిపింది.
Also Read | దేవినేని ఉమా, సోమి రెడ్డి లను అభినందించిన కొడాలి నాని