కరోనా వ్యాప్తి నిరోధానికి సుప్రీం కీలక నిర్ణయం

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి న్యాయవాదులు నేరుగా కోర్టుకు వచ్చి వాదించాల్సిన అవసరం లేదని…అత్యవసర కేసుల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇంటి నుంచే వాదించాలని సూచించింది.
సోమవారం సాయంత్రం 5గంటల తర్వాత సుప్రీంకోర్టులో ఉన్న లాయర్ల ఛాంబర్లకు తాళాలు వేయనున్నారు. ఈలోగా అవసరమైన కాగితాలను ఇంటికి తీసుకెళ్లాలని ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ. బోబ్డే తెలిపారు. న్యాయవాదులు ఇంటినుంచి వాదించేందుకు వీలుగా కొన్ని లింక్ లు పంపిస్తామని వాటిని డౌన్లోడ్ చేసుకుని వీడియో కాల్ కనెక్ట్ చేసుకుని వాదించవచ్చని ఆయన తెలిపారు. ఈ ఆదేశాలను ప్రతి వారం సమీక్షిస్తామని, కోర్టుహాల్లో న్యాయవాదులు వ్యక్తిగతంగా హాజరు కావద్దని తెలిపారు.
కోర్టులోకి ప్రవేశించడానికి ఆస్కారం కల్పించే ఐడీ కార్డులు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సీజే ప్రకటించారు. లాయర్ల ఎలక్ట్రానిక్ పాస్ లను కూడా రద్దు చేశారు. వైరస్ వ్యాప్తి పెరిగిపోతున్నందున కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాల్లో లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కరోనాను కట్టడి చేయాలంటే కఠిన నిర్ణయాలు తప్పవని తెలిపింది. కేంద్ర ఆదేశాలకు అనుగుణంగానే సుప్రీం కోర్టు కూడా తాజా నిర్ణయం తీసుకుంది.
See Also | కరోనా ముప్పు, లోక్సభ నిరవధిక వాయిదా