Covid-19 India : దేశంలో భారీగా తగ్గిన కొత్త కేసులు.. 20వేలకు దిగువన రోజువారీ కేసులు..
ఇండియాలో కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గతకొన్నిరోజులుగా కరోనా కొత్త కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. దాంతో రోజువారీ కరోనా కేసులు ఏకంగా 20 వేల దిగువకు పడిపోయాయి
Covid-19 India Live Updates : భారతదేశవ్యాప్తంగా కరోనా కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. గతకొన్నిరోజులుగా కరోనా కొత్త కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. దాంతో రోజువారీ కరోనా కేసులు ఏకంగా 20 వేల దిగువకు పడిపోయాయి. కరోనా మరణాల్లో స్వల్పంగా పెరుగుదల కనిపించినా.. రోజువారీ కరోనా కొత్త కేసుల్లో క్షీణత కనిపించింది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ థర్డ్ వేవ్ ప్రభావం కూడా తగ్గిపోవడంతో పలు రాష్ట్రాలు ఆంక్షలను సడిలిస్తున్నాయి. దేశంలో గత 24 గంటల్లో 19,968 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అలాగే 48,847 రికవరీ కేసులు ఉండగా, కొత్తగా 673 మరణాలు నమోదయ్యాయి.
2.24 లక్షలకు పడిపోయిన యాక్టివ్ కేసులు :
దేశంలో కరోనా యాక్టివ్ కేసులు ప్రస్తుతం 2,24,187 (0.52శాతం)లక్షలకు పడిపోయాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 1.68శాతంగా నమోదైంది. గత 24 గంటల్లో 48,847 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 4,20,86,383కి చేరింది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు 175.33 కోట్ల వ్యాక్సిన్ డోసులు అందాయి. ఇప్పటివరకు దేశంలో మొత్తంగా 5,11,903 మంది కరోనాతో మరణించారు.
ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 98.2 శాతంగా ఉంది. ఇక కరోనా మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 2.5 శాతంగా ఉంది. దేశంలో కరోనా కేసులు, మరణాలు అధికంగా నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ఢిల్లీ, ఒడిశా, రాజస్థాన్, గుజరాత్ ముందువరుసలో ఉన్నాయి. మహారాష్ట్రలో అత్యధికంగా ఇప్పటివరకు మొత్తం 78,56,994 మందికి కరోనా సోకింది. అలాగే 1,43,576 మంది కరోనాతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.
82శాతం మందికి రెండు డోసులు :
మరోవైపు.. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు పెద్దవారిలో 82 శాతం మందికి రెండు డోసుల కరోనా టీకాలు అందాయి. 97 శాతం మంది మొదటి డోసు టీకా అందుకున్నారు. థర్డ్ వేవ్ ప్రభావం తగ్గడానికి వ్యాక్సిన్లు తీసుకున్న వారి సంఖ్య అధికంగా ఉండటమేనని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రెండు కోట్ల మంది టీనేజర్లకు 15-18ఏళ్ల వయస్సు వారికి రెండు డోసుల వ్యాక్సిన్లు అందించారు. 15-18 మధ్య ఏళ్ల వయస్సు ఉన్న రెండు కోట్ల మందికి కరోనా రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
పెద్దల్లో 80 శాతం మందికి రెండు డోసులు పూర్తి కాగా.. దాదాపు 97 శాతం మంది మొదటి డోసును అందుకున్నారు. ఇప్పటివరకు దేశంలో మొత్తంగా 175.4 కోట్ల మందికి కరోనా టీకా డోసులను పంపిణీ చేశారు. వారిలో మొదటి డోసు తీసుకున్న వారి సంఖ్య 90.7 కోట్లకు చేరగా.. రెండు డోసులు అందుకున్న వారి సంఖ్య 75.2 కోట్లకు చేరిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Read Also : India Covid : భారత్లో తగ్గుతున్న కరోనా కేసులు.. కొత్తగా ఎన్ని కేసులంటే