కోవీషీల్డ్ టీకా అత్యంత సురక్షితం…చెన్నై వాలంటీర్ తో సంబంధం లేదు : సీరం
incident with Chennai volunteer no way induced by it: Serum Institute కోవిడ్ వ్యాక్సిన్ “కోవీషీల్డ్” తీసుకున్న ఓ వాలంటర్ ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు వస్తున్న వార్తలను ఇవాళ(డిసెంబర్-1,2020)సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఖండించింది. చెన్నైకి చెందిన ఓ వాలంటీర్ “కోవీషీల్డ్”వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల నరాల బలహీనత ఏర్పడినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.
దీనిపై ఇవాళ సీరం సంస్థ అధినేత ఆధార్ పూనావాలా ప్రకటన చేశారు. చెన్నై వాలంటీర్ లో కలిగిన దుష్ ప్రభావాలకు తమ వ్యాక్సిన్తో సంబంధం ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ వాలంటీర్ ఆరోపణలకు తమ వ్యాక్సిన్తో సంబంధం లేదని సీరం స్పష్టం చేసింది. వాలంటీర్ చేసిన ఆరోపణలు మోసపూరితమైనవని, తప్పుడు ధోరణిలో ఉన్నాయన్నారు. ఆ వాలంటీర్పై వంద కోట్ల పరువు నష్టం కేసు వేయనున్నట్లు ఆ ప్రకటనలో తెలిపారు. వ్యాక్సిన్ ట్రయల్కు, వాలంటీర్కు సంబంధం లేదని ఆ కంపెనీ ఎథిక్స్ కమిటీ తెలిపింది. కంపెనీ ప్రతిష్టను కాపాడుకునేందుకు సదురు వాలంటీర్కు లీగల్ నోటీసులు జారీ చేసినట్లు సీరం సంస్థ వెల్లడించింది.
ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ను పూణేకు చెందిన సీరం ఇనిస్టిట్యూట్ కోవిషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తున్న విషయం తెలిసిందే. కోవీషీల్డ్ టీకా అత్యంత సురక్షితంగా ఉన్నట్లు సీరం ఇనిస్టిట్యూట్ ఈ సందర్భంగా స్పష్టం చేసింది. తమ టీకా సురక్షితంగా, రోగనిరోధక శక్తిని పెంచేవిధంగా ఉన్నట్లు సీరం ఓ ప్రకటనలో పేర్కొన్నది.
మరోవైపు, కరోనా వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి సీరం ఇనిస్టిట్యూట్ రెండు వారాల్లో దరఖాస్తు చేయనున్నట్లు సీరం ఇస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా రెండు రోజుల క్రితమే తెలిపిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ శనివారం ఇనిస్టిట్యూట్ను సందర్శించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.