గుజరాత్‌ను వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి

గుజరాత్‌ను వణికిస్తున్న ప్రాణాంతక వ్యాధి

Updated On : December 18, 2020 / 5:21 PM IST

deadly fungal infection strikes Ahmedabad : ఏలూరు ప్రజలను భయపెట్టిన వ్యాధి ఏమిటీ… ముగ్గురు మరణించడానికి కారణం ఏమిటీ… 600 మందిని ఆసుపత్రి పాలు చేసిన వింత వ్యాధి ఏమిటీ… ఏమో ఇంత వరకు సరైన కారణం తెలియకముందే.. మరో ప్రాణాంతక వ్యాధి బయటపడింది. అయితే ఈసారి గుజరాత్ రాష్ట్రంలో. కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో గుజరాత్‌ను ప్రాణాంతక వ్యాధి వణికిస్తోంది. మ్యూకోర్మైకోసిస్‌ అనే అరుదైన శిలీంధ్ర వ్యాధి కారణంగా అహ్మదాబాద్‌లో ఇప్పటికే తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 30 మందికి పైగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గుజరాత్‌తో పాటు ఢిల్లీ, ముంబయిలోనూ ఈ వ్యాధి కేసులు బయటపడుతున్నట్లు సమాచారం.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఇప్పటివరకు 44 మంది ఈ వ్యాధి బారిన పడగా.. 9మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు రోజుల క్రితం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో 12 కేసులు నమోదైనట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు ఈ వ్యాధికి గురైన వారంతా 50ఏళ్ల పైబడినవారే. కరోనా నుంచి కోలుకున్నవారిలోనూ ఈ వ్యాధి లక్షణాలు కన్పించినట్లు తెలుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజస్థాన్‌ సీఎం అశోక్ గెహ్లోత్‌ కూడా హెచ్చరించారు. కొవిడ్‌ 19 నుంచి కోలుకుంటున్నవారు మ్యూకోర్మైకోసిస్‌ బారిన పడే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రాణాంతక వ్యాధి. దీని వల్ల శరీరంలో మెదడుతో పాటు పలు అవయవాలు పనిచేయకుండా పోతాయి. ముంబయి, అహ్మదాబాద్‌ నగరాల్లో ఇప్పటికే దీనిపై హెచ్చరికలు చేశారని గెహ్లోత్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు.

అసలు ఏంటీ మ్యూకోర్మైకోసిస్‌.. ఈ వ్యాధిని గతంలో జైగోమైకోసిస్‌ అనేవారు. అత్యంత అరుదైన ఈ ఫంగస్‌ ఇన్ఫెక్షన్‌ చాలా ప్రమాదకరమైనది. మ్యూకోర్మైసెటీస్‌ అనే శిలీంధ్రం కారణంగా ఈ ఇన్ఫెక్షన్‌ సోకుతుంది. తొలుత ముక్కు నుంచి ప్రారంభమై.. కళ్లకు సోకుతుంది. వ్యాధిని త్వరగా గుర్తించి చికిత్స అందించడం వల్ల దీని నుంచి బయటపడొచ్చు. లేదంటే ప్రాణాంతకంగా మారుతుంది. ఇన్ఫెక్షన్‌ కళ్లను చేరిన తర్వాత కంటి చుట్టూ ఉండే కండరాలు పనిచేయకుండా పోతాయి. ఫలితంగా కంటిచూపు పోయే ప్రమాదం ఉంది. ఇక మెదడును చేరితే.. ఆ రోగి మెదడువాపు‌ బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.