Ram Mandir Road Trip Guide : అయోధ్య రామమందిర దర్శనానికి వెళ్తున్నారా? రోడ్డుమార్గంలో ఎలా చేరుకోవాలంటే? రోడ్ ట్రిప్ గైడ్ ఇదిగో..!
Ram Mandir Ayodhya road trip guide : అయోధ్య రామమందిర సందర్శనకు వెళ్తున్నారా? అయితే.. ఏయే రోడ్డుమార్గంలో ఎలా చేరుకోవాలో తెలుసా? రూట్, టైమింగ్స్, టోల్ ఫీజులకు సంబంధించిన పూర్తివివరాలు మీకోసం..
Ram Mandir Ayodhya road trip guide : శ్రీరామ జన్మస్థలమైన అయోధ్యలో వందల ఏళ్ల తర్వాత నూతన రామమందిరంలో బాలరాముడు కొలువుదీరాడు. బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామమందిరంలోని గర్భగుడిలో అభిజిత్ లగ్నంలో బాల రాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది.
జనవరి 22న మధ్యాహ్నం 12.29 నిమిషాల 8 సెకన్ల నుంచి బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలరాముడికి ప్రధాని మోదీ తొలిపూజ నిర్వహించారు. ఈ మహోన్నత కార్యక్రమాన్ని వీక్షించిన భక్తులు పులకించిపోయారు. రామ జన్మస్థలమైన అయోధ్యలోని నూతన రామమందిరాన్ని సందర్శించేందుకు భక్తులు ఆసక్తి చూపిస్తున్నారు.
బాలరాముని సందర్శనం సమయాలివే :
ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు భక్తజనం భారీగా తరలివస్తున్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం లక్షలాది మంది యాత్రికులను రామమందిరం మరింతగా ఆకర్షిస్తోంది. ఈ నేపథ్యంలో జనవరి 23 నుంచి సాధారణ భక్తులకు కూడా బాలరాముని సందర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు. అయితే, భక్తులు 24 అడుగుల దూరం నుంచి రాముని దర్శించుకోవచ్చు.
ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 11.30 గంటల వరకు, ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది. ప్రతిరోజూ బాలరామునికి మూడు సార్లు హారతులు ఇస్తారు. ఉదయం 6.30 గంటలకు శృంగార హారతి, మధ్యాహ్నం 12 గంటలకు భోగ్ హారతి, రాత్రి 7.30 గంటలకు సంధ్యా హారతి కూడా ఉంటుంది.
దర్శనానికి పాసుతో పాటు ఐడీ తప్పనిసరి :
హారతి సమయాల్లో సాధారణ భక్తులకు ఆలయంలోకి అనుమతి ఉండదని గమనించాలి. భక్తులు ఎవరైనా హారతి దర్శనం కోసం ప్రత్యేకంగా పాస్ తీసుకోవాలి. ఆన్లైన్లో దర్శనం పాస్లను తీర్థయాత్ర వెబ్సైట్ నుంచి పొందవచ్చు. అంతేకాదు.. జన్మభూమిలో క్యాంపు కార్యాలయం నుంచి కూడా ఆఫ్లైన్లో పాసులను తీసుకోవచ్చు. రామ మందిరానికి వచ్చే భక్తులు పాస్తో పాటు చెల్లుబాటు అయ్యే గుర్తింపు ఐడీని తప్పనిసరిగా చూపించాలి.
రామజన్మభూమికి ఎలా చేరుకోవాలంటే? :
ఆయోధ్య రామమందిరాన్ని సందర్శించుకునే యాత్రికులు, భక్తులు రోడ్డుమార్గంలో చేరుకోవచ్చు. దేశ రాజధాని ఢిల్లీ నుంచి అయోధ్య వరకు దాదాపు 690 కి.మీ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సుదీర్ఘమైనప్పటికీ.. రోడ్డు మార్గంలో కూడా ప్రయాణించవచ్చు. ఢిల్లీ నుంచి రోడ్డు మార్గంలో రామజన్మభూమికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
కారులో వెళ్లేందుకు ఇదే బెస్ట్ వే :
ఢిల్లీ నుంచి అయోధ్య రామమందిరానికి సొంత కారులో వెళ్లేందుకు ఇదే బెస్ట్ వే.. యమునా ఎక్స్ప్రెస్వే మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. ఆపై మీ గమ్యాన్ని చేరుకోవడానికి ఆగ్రా – లక్నో ఎక్స్ప్రెస్వే, నేషనల్ హైవే 19, నేషనల్ హైవే 30 వంటి హైవేల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. మీ ట్రిప్ సమయంలో మీరు తీసుకునే రిఫ్రెష్మెంట్ బ్రేక్లను మినహాయించి ప్రయాణానికి దాదాపు 10 గంటల సమయం పడుతుంది.
వన్ వే జర్నీ.. టోల్ ఫీజు రూ.1350 వరకు చెల్లించాలి :
మీరు జాతీయ రాజధాని ప్రాంతం నుంచి బయలుదేరినప్పుడు జెవార్ వద్ద టోల్ ప్లాజాలను యమునా ఎక్స్ప్రెస్ వే మీదుగా దాటాల్సి ఉంటుంది. మొత్తం ప్రయాణంలో అనేక టోల్ ప్లాజాలను దాటవచ్చు. వన్-వే జర్నీకి సుమారు రూ. 1,350 వరకు చెల్లించాల్సి ఉంటుంది. టోల్ ప్లాజాలను దాటడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆలస్యాన్ని నివారించడానికి కచ్చితమైన మార్గం లేదా ఫాస్ట్ట్యాగ్ వినియోగించుకోవడం మంచిది. ప్రయాణం మధ్యలో మథుర, బృందావన్ లేదా లక్నో మార్గాల్లో కూడా వెళ్లవచ్చు.
ఢిల్లీ నుంచి అయోధ్య వరకు.. బస్సు ప్రయాణం :
మీరు దూర ప్రయాణాల సమయంలో డ్రైవింగ్ చేయడానికి పెద్దగా ఇష్టపడకపోతే.. మీరు రాష్ట్ర బస్సు సర్వీసులతో పాటు ప్రైవేట్ బస్సు సర్వీసులను కూడా ఎంచుకోవచ్చు. సెమీ స్లీపర్, స్లీపర్, వంటి అనేక ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. మీరు అనేక ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫారమ్లలో కూడా ఈ బస్సులను బుక్ చేసుకోవచ్చు.
Read Also : Ayodhya Ram Mandi : అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం.. ప్రధాని చేతులమీదుగా కొలువుదీరిన బాలరాముడు