ఎసెన్షియల్ సర్వీసెస్ : మద్యం హోం డెలివరీకి సీఎం గ్రీన్ సిగ్నల్

లాక్డౌన్ కారణంగా మద్యం దొరక్క నానా అవస్థలు పడుతున్నవారికి మమతా బెనర్జీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. లాక్డౌన్ సమయంలో వెస్ట్ బెంగాల్ లో మద్యం హోమ్ డెలివరీకి అనుమతించాలని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిర్ణయం తీసుకున్నట్టు ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వర్గాల ద్వారా తెలిసింది.
లాక్ డౌన్ సమయంలో లిక్కర్ అమ్మకాలపై ఎటువంటి నిషేధం లేదని తెలిపారు. కాగా, ఇటీవలే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లాక్డౌన్ ఉన్నప్పటికీ స్వీట్ షాపులను కొన్ని గంటలపాటు తెరచి ఉంచేందుకు అనుమతులు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే లాక్డౌన్ వల్ల మూతపడ మద్యం షాపులను తెరవబోమని బెంగాల్ ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. అయితే ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నవారికి మాత్రం మద్యం షాపుల నుంచి హోం డెలివరీ చేయనున్నట్టు చెప్పారు.
మద్యం విక్రేతలకు స్థానిక పోలీసుల స్టేషన్లలో హోం డెలివరీకి సంబంధించిన పాస్లు జారీ చేయనున్నాం. ఇందుకోసం మద్యం షాప్ యజమానులు స్థానిక పోలీసులను సంప్రదించాలి. ఒక్క షాపుకు మూడు డెలివరీ పాస్లు ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నాం. వినియోగదారులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్యలో వారి ఫోన్ల ద్వారా మద్యం కొనుగోలుకు ఆర్డర్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల మధ్యలో మద్యం సరఫరా చేసేలా ఏర్పాట్లు చేస్తున్నాం’అని ఎక్సైజ్ శాఖ తెలిపింది.