ఆలస్యం అవ్వకుండా : సరుకుల రవాణాకు ఫస్ట్ ‘కార్గో ఎక్స్ ప్రెస్’

సరుకులు రవాణా చేసే గూడ్స్ రైళ్లు ఎప్పుడూ లేట్ గా నడుస్తుంటాయి. అనుకున్న సమయానికి గమ్యం చేరటంలేదు. ఈ రైళ్లు ఎప్పుడు వస్తాయో ఏంటో అనేది రైల్వే శాఖ కూడా చెప్పలేని పరిస్థితి. దీంతో సరుకుల రవాణా ఆలస్యం అవుతోంది. దీంతో సరుకు రవాణా సేవల విషయంలో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ‘కార్గోలో ఎక్స్ప్రెస్’ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది భారతీయ రైల్వే.
దీంట్లో భాగంగా ఆగస్టు 5 నుంచి ఆరు నెలలపాటు ప్రయోగాత్మకంగా ‘కార్గో ఎక్స్ప్రెస్’ సేవలను ప్రవేశపెట్టనున్నట్లుగా నిర్ణయించామని దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ‘కార్గో ఎక్స్ప్రెస్’ సేవల విషయంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా మాట్లాడుతూ..వ్యవసాయ ఉత్పత్తిదారులు, వ్యాపారులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులకు చక్కటి ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. హైదరాబాద్-ఢిల్లీ మధ్య టన్నుకు సగటున రూ. 2,500 కనీస ధరను నిర్ణయించామని సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ తెలిపారు.
కాకపోతే..‘కార్గో ఎక్స్ప్రెస్’ లో రవాణా చేసే సరుకును బట్టి ధర మారుతుందని..కానీ రోడ్డు రవాణాతో పోలిస్తే ఈ సేవలు 40 శాతం తక్కువని..అవసరమైన వారు 97013 71976, 040-27821393 నంబర్లలో కానీ, దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్సైట్లో కానీ సంప్రదించాలని ఆయన తెలిపారు.