కొత్త కారు కొనాలనుకునేవారికి కేంద్రం గుడ్ న్యూస్
2021-22 బడ్జెట్లో స్వచ్ఛంద వాహన తుక్కు విధానాన్ని(voluntary vehicle scrapping policy) ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు, వాణిజ్య(కమర్షియల్) వాహనాలకు 15 ఏళ్ల కాలం గడిచాక తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. యజమానులు పాత వాహనాలు వదిలించుకునేందుకు ప్రోత్సహించేలా, కొత్తవాటి కొనుగోలుపై 5 శాతం రాయితీని తయారీ సంస్థలు అందిస్తాయని మంత్రి తెలిపారు.

good news for those buy new car: మీరు కొత్త కారు కొనుక్కోవాలనుకుంటున్నారా. అయితే మీకో గుడ్ న్యూస్. వాహన తుక్కు విధానం కింద పాతది ఇస్తే.. కొత్తదానిపై కంపెనీలు 5 శాతం రాయితీ ఇస్తాయి. ఈ మేరకు కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆదివారం(మార్చి 7,2021) తెలిపారు. 2021-22 బడ్జెట్లో స్వచ్ఛంద వాహన తుక్కు విధానాన్ని(voluntary vehicle scrapping policy) ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. వ్యక్తిగత వాహనాలకు 20 ఏళ్లు, వాణిజ్య(కమర్షియల్) వాహనాలకు 15 ఏళ్ల కాలం గడిచాక తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని చెప్పారు. యజమానులు పాత వాహనాలు వదిలించుకునేందుకు ప్రోత్సహించేలా, కొత్తవాటి కొనుగోలుపై 5 శాతం రాయితీని తయారీ సంస్థలు అందిస్తాయని మంత్రి తెలిపారు.
భారీగా జరిమానాలు, శిక్షలు:
”ఈ విధానంలో 4 ప్రధాన అంశాలుంటాయి. కొత్త వాహనాలపై రాయితీ, పాతవాటిపై పర్యావరణ పన్నులు(green taxes), ఇతర సుంకాలు(levies) ఉంటాయి. తప్పనిసరిగా ఫిట్నెస్, కాలుష్య ధ్రువీకరణ పరీక్షలకు(pollution tests) పాత వాహనాలను తీసుకెళ్లాలి. మానవ ప్రమేయం లేకుండా ధ్రువీకరణ పత్రాలను అందించే ఈ పరీక్షా కేంద్రాలను(automated fitness test centers) దేశవ్యాప్తంగా నెలకొల్పేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఈ పరీక్షల్లో విఫలమైన వాహనాలను వినియోగిస్తే యజమానులకు భారీ జరిమానాలుంటాయి, శిక్షలూ ఉండొచ్చు. ఈ కేంద్రాలను ప్రభుత్వ-ప్రైవేటు (పీపీపీ) విధానంలో నెలకొల్పుతాం. తుక్కు కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలకు సహకరిస్తాం’’ అని గడ్కరీ వివరించారు.
ఖర్చులు, చమురు వినియోగం తగ్గుతుంది..ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి:
ఈ విధానం వల్ల దేశీయ వాహన పరిశ్రమ(automobile sector) ప్రస్తుత రూ.4.5 లక్షల కోట్ల స్థాయి నుంచి రూ.10 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందనే అంచనాను మంత్రి వ్యక్తం చేశారు. పాత వాహనాల నుంచి లభించే ఉక్కు, ప్లాస్టిక్, రబ్బర్, అల్యూమినియం వంటి ముడిపదార్థాల వల్ల వాహన విడిభాగాల పరిశ్రమలకు వ్యయాలు 30-40 శాతం తగ్గుతాయన్నారు. ప్రస్తుతం ముడిచమురు దిగుమతికి ఏటా రూ.8 లక్షల కోట్లు వెచ్చిస్తున్నామని, అధిక మైలేజీ నిచ్చే కొత్త వాహనాలు, విద్యుత్తు వాహనాల కొనుగోళ్ల వల్ల ఇది అదుపులోకి వస్తుందని వివరించారు. భారీగా ఉద్యోగావకాశాలు కూడా లభిస్తాయని తెలిపారు.