దేవుడి దయ : విషమిస్తున్న పారికర్ ఆరోగ్యం

  • Published By: chvmurthy ,Published On : February 5, 2019 / 09:36 AM IST
దేవుడి దయ : విషమిస్తున్న పారికర్ ఆరోగ్యం

Updated On : February 5, 2019 / 9:36 AM IST

పణజి: పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్‌ పారికర్‌ ఆరోగ్యం అస్సలు బాగోలేదని, ఆయన వ్యాధి ఇంకా నయం కాలేదని, దేవుడి దయవల్లే ఆయన ఇంకా సీఎం గా విధులు నిర్వహిస్తున్నారని, డిప్యూటీ స్పీకర్‌, బీజేపీ సీనియర్‌ లీడర్‌ మైఖేల్‌ లోబో సోమవారం వ్యాఖ్యానించారు.  విధులు నిర్వర్తించలేక ఆయన పదవిలో నుంచి దిగిపోయినా లేదా మరణించినా, గోవాలో రాజకీయ సంక్షోభం తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాలనకు దూరంగా ఉన్నపారేకర్‌ పదవి నుంచి దిగిపోవాలని లోబో గతంలో కూడా డిమాండ్‌  చేశారు. జీఎఫ్‌పీ, ఎంజీపీ, మరో ముగ్గురు స్వతంత్ర్య ఎమ్మెల్యేల మద్దతుతో  గోవాలో బీజేపీ ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. 63 ఏళ్ల  పారికర్ కు గతేడాది ఫిబ్రవరిలో పాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ వ్యాధి ఉన్నట్లు కనుగొన్నారు. మొదట అమెరికాలో చికిత్స చేయించుకుని వచ్చిన ఆయన  ప్రస్తుతం ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. 

కాగా, పారికర్ ఆరోగ్యం నిలకడగా ఉందని డిల్లీ ఎయిమ్స్‌ వైద్యులు  శనివారం విడుదల చేసిన న్యూస్ బులెటిన్లో  తెలిపారు. వరల్డ్‌ క్యాన్సర్‌ డే (ఫిబ్రవరి 4) సందర్భంగా.. ‘మనిషి బుద్ధి బలం చాలా గొప్పది. ఎటువంటి వ్యాధులనైనా తట్టుకొని నిలబడగలిగేలా నడిపిస్తుంది’ అని పారికర్ ఒక సందేశంలో  పేర్కొన్నారు. అనారోగ్యం కారణాల వల్ల బాగా చిక్కిపోయిన పారేకర్ గతవారం అసెంబ్లీకి వచ్చారు. ఇదిలాఉండగా  పారికర్ ను పదవి నుంచి  తప్పించి బీజేపీ సీనియర్‌ నేత సుదీన్‌ ధవాలికర్‌ను సీఎంగా నియమించాలని పలువురు డిమాండ్‌ చేస్తున్నారు.